ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రేటర్‌ వాసులకు బిగ్‌ అలర్ట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 22, 2024, 05:11 PM

 హైదరాబాద్‌ మహానగరంలో రెండు రోజులు తాగునీరు సరఫరాకు అంతరాయం కలుగనుంది. కృష్ణా డ్రింకింగ్‌ వాటర్‌ సప్లయి ఫేస్‌-3లోని 2375 ఎంఎం డయా ఎంఎస్‌ పంపింగ్‌ మెయిన్‌కు లీకేజీ ఏర్పడినట్లు అధికారులు గుర్తించారు.దీనిని అరికట్టడానికి మరమ్మతు పనులు చేపట్టారు. దీనిలో భాగంగా అక్టోబర్‌ 24వ తేదీ (గురువారం) ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు అంటే అక్టోబర్ 25వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు మరమ్మత్తు పనులు చేయనున్నారు. ఈ కారణంగా 24 గంటల పాటు రిజర్వాయర్‌ ప్రాంతాల్లోని వివిధ ఏయియాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ముందుగానే నీళ్లు అధికంగా పట్టుకుని పొదుపుగా వాడుకోవాలని నగర వాసులకు అధికారులు సూచించారు.


శాస్త్రిపురం, బండ్లగూడ, భోజగుట్ట, షేక్‌పేట, జూబ్లీహిల్స్‌, సరూర్‌నగర్‌, వాసవీ రిజర్వాయర్లు, ఫిలింనగర్‌, ప్రశాసన్‌నగర్‌, తట్టిఖానా, లాలాపేట్‌, సాహేబ్‌నగర్‌, ఆటోనగర్‌, సైనిక్‌పురి, మౌలాలి, 9 నంబర్‌, కిస్మత్‌పూర్‌, గచ్చిబౌలి, దేవేంద్రనగర్‌, మధుబన్‌, దుర్గానగర్‌, బుద్వేల్‌, మాదాపూర్‌, అయ్యప్ప సొసైటీ, కావూరి హిల్స్‌, స్నేహపురి, కైలాసగిరి, సులేమాన్‌ నగర్‌, గోల్డెన్‌ హైట్స్‌, పెద్ద అంబర్‌పేట తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచనలు జారీ చేశారు.


మరోవైపు డ్రైనేజీ వ్యవస్థను కూడా పునరుద్ధరించేందుకు వాటర్‌ బోర్డు అధికారులు సమాయాత్తమవుతున్నారు. 90 రోజుల స్పెషల్ డ్రైవ్లో ప్రతి మ్యాన్‌ హోల్‌ను శుభ్రం చేయాలని నిర్ణయించింది. నగరంలోని మొత్తం మూడున్నర లక్షల మ్యాన్‌ హోళ్లు క్లీన్‌ చేయాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నట్టు వాటర్ బోర్డు ఎండీ అశోక్రెడ్డి వెల్లడించారు. రోజుకు 400 మ్యాన్ హోల్స్ క్లీనింగ్ చేయాలని క్షేత్రస్థాయిలో సిబ్బందిని ఆదేశించినట్లు ఆయన చెప్పారు. ఇందుకోసం 25 స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఒక్కో టీమ్‌లో ఐదుగురు సిబ్బంది ఉంటారు. క్లీనింగ్ కోసం 200 ఎయిర్ టెక్ మెషీన్లు వినియోగిస్తున్నట్లు అశోక్ రెడ్డి వెల్లడించారు. పూడిక తీశాక వ్యర్థాలను తరలించడానికి మరో 140 సిల్ట్ క్యారియర్ వాహనాలను గ్రౌండ్‌ లెవల్‌లోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com