ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ పోలీసులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. అంతర్జాతీయ ప్రమాణాలతో.. ఉత్తర్వులు జారీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2024, 09:56 PM

తెలంగాణ పోలీసులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ వినిపించింది. పోలీసుల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు.. "యంగ్ ఇండియా పోలీస్ స్కూల్" ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట మేరకు.. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ స్థాపనకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని పోలీసు అమరవీరులతో పాటు, ప్రస్తుతం విధుల్లో ఉన్న పోలీసులు, ఇతర యూనిఫాం సర్వీస్ డిపార్ట్‌మెంట్‌లకు చెందిన సిబ్బంది పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో చదువును అందించేలా పాఠశాలను సిద్ధం చేసేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు.. రాష్ట్ర హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రవి గుప్త సోమవారం(అక్టోబర్ 21న) రోజున జీవో జారీ చేశారు.


అయితే.. ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ భవనాన్ని నిర్మించేందుకు రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో స్థలాన్ని కూడా కేటాయించారు. అంతేకాకుండా.. మంచిరేవులలో నిర్మించబోయే యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన కూడా చేశారు. భవన నమూనా చిత్రాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతి కుమారి, మంత్రి శ్రీధర్ బాబు తడితరులు పాల్గొన్నారు.


పోలీస్ అమరుల పిల్లలతో పాటు సర్వీసులో ఉన్న పోలీసులు, ఫైర్, ఎక్సైజ్ లాంటి వివిధ రకాల సిబ్బంది పిల్లలకు ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌లో అడ్మిషన్లు కల్పించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ పాఠశాల ఏర్పాటుకు అవసరమైన తదుపరి చర్యలను తీసుకోవాలని డీజీపీని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


అయితే.. హైదరాబాద్ రాజ్‌బహదూర్ వెంకటరామిరెడ్డి పోలీస్ అకాడమీలో పోలీస్ డ్యూటీ మీట్-2024 ముగింపు వేడుకల్లో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ నిర్మించనున్నట్టు.. వచ్చే ఏడాది నుంచి 1 నుంచి 5 తరగతులతో ఈ స్కూల్ ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఒక్కో ఏడాది ఒక్కో తరగతి పెంచుకుంటూ డిగ్రీ వరకు నాణ్యమైన విద్యను అందించేలా ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను తీర్చిదిద్దుతామని వివరించారు.


అయితే.. ఈరోజు (అక్టోబర్ 21న) పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసులకు శుభవార్త వినిపిస్తూ.. రేవంత్ రెడ్డి సర్కార్ ఈ స్కూల్‌ స్థాపనకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయటం విశేషం.


అట్లుంటది మల్లారెడ్డితోని.. మనవరాలి పెళ్లి వేడుకలో మాస్ స్టెప్పులు


అయితే.. ఈరోజు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా.. గోషామహల్ పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించి.. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం ప్రసంగిస్తూ.. త్యాగానికి, సేవకు పోలీసులు ప్రతీక అని కొనియాడారు. సమాజంలో పోలీసుల సేవలు మరువలేనివన్నారు. ఇక పోలీసుల సంక్షేమ నిధికి ప్రతి ఏడాది రూ. 20 కోట్లు కేటాయించనున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించారు. విధుల్లో వీరమరణం పొందిన పోలీసుల కుటుంబాలకు కూడా పరిహారం అదిస్తామన్నారు.


కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ స్థాయి పోలీసులు విధుల్లో ఉండగా మరణిస్తే కోటి రూపాయన పరిహారం, ఎస్‌ఐ, సీఐ స్థాయి అధికారులకు 1.25 కోట్లు, డీఎస్పీ, అడిషనల్ ఎస్పీ, ఎస్పీ స్థాయి అధికారులకు 1.50 కోట్లు, ఐపీఎస్‌ల కుటుంబాలకు రూ. 2 కోట్లు పరిహారం ఇవ్వనున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. విధుల్లో ఉండగా.. ప్రమాదవశాత్తు శాశ్వత అంగవైకల్యం పొందితే 50 లక్షలు, చనిపోయిన కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com