జీవో 29 అనేది ఓపెన్ కోటాను కూడా రిజర్వ్ చేసేలా ఉందన్నారు. ఫిబ్రవరి నుంచే తాము ఇది అన్యాయమైన జీవో అని చెబుతూ వస్తున్నామన్నారు. గ్రూప్-1కు మెయిన్స్ పరీక్ష రాసే పిల్లలకు ప్రశాంతమైన వాతావారణం లేకుండా చేశారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం వాళ్లను బతకనివ్వకుండా ఎగ్జామ్కు వారం రోజుల ముందు ఇబ్బందులు పెట్టిందని ఆరోపించారు. కోర్టు కేసు తేలేదాక తాము విద్యార్థులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జీవో 29 రాజ్యాంగ విరుద్ధమని చెప్పటం తప్పా? అని నిలదీశారు. స్థానికులకు 95 శాతం రిజర్వేషన్లను కేసీఆర్ తెచ్చారని, కానీ దాంట్లో నాన్ లోకల్స్ వచ్చేలా కుట్రలు చేస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారన్నారు. నాడు రాహుల్ గాంధీ అశోక్ నగర్ వస్తే సెక్యూరిటీ కల్పించామని, కానీ ఇప్పుడు మాత్రం తమను అరెస్ట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు.తెలుగు అకాడమీ ప్రామాణికం కాదని చెబితే ఎలా అని నిలదీశారు. ఈ అన్ని అంశాలు తేలే వరకు ఎగ్జామ్స్ రీ-షెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి తన చర్య ద్వారా బలహీన వర్గాలపై ఉన్న వ్యతిరేకతను చాటుకున్నారన్నారు. జీవో 29 ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను ఎత్తివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణేతరులకు కూడా ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయోజనాలు కల్పించే కుట్ర చేస్తోందన్నారు. పరీక్షల విషయంలో ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 29 విషయంలో న్యాయవాదిని పెట్టి విద్యార్థుల తరఫున కొట్లాడుతామన్నారు. ప్రభుత్వం బేషజాలకు పోవద్దని, ప్రజాస్వామ్యంలో ఎక్కడ తగ్గాలో... ఎక్కడ నెగ్గాలో తెలిసి ఉండాలన్నారు. తాను జర్నలిస్ట్లను అవమానించానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు పెద్ద ఎత్తున రాజకీయ అవకాశాలు కల్పించిందే బీఆర్ఎస్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో యాజమాన్యాలు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ... జర్నలిస్ట్లు తెలంగాణ కోసం ఎంతో కష్టపడ్డారని గుర్తు చేసుకున్నారు. అందుకే వారంటే బీఆర్ఎస్కు గౌరవమన్నారు.