ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దూకుడు పెంచిన 'హైడ్రా'.. కోట్ల విలువైన విల్లాలపైకి బుల్డోజర్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 08, 2024, 10:42 PM

హైదరాబాద్ నగరంలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలను పరిరక్షించేందుకు ఏర్పాటైన హైడ్రా మరింత దూకుడుగా వ్యవహరిస్తే.. గత నెల రోజులుగా నగరంలోని పలు అక్రమ కట్టడాలను నేలమట్టం చేసింది. చెరువులు, కుంటల బఫర్ జోన్లు, ఎఫ్‌టీఎల్ పరిధులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చేశారు. సినీహీరో నాగార్జున చెందిన ఎన్ కన్వెన్షన్‌తో పాటుగా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చెందిన అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. నేడు కూడా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు.


 రూ.కోట్ల విలువైన విల్లాలపై బుల్డోజర్లు పంపుతున్నారు. తాజాగా.. మాదాపూర్ సున్నపు చెరువులో అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చేస్తున్నారు. మాదాపూర్ 100 ఫీట్ రోడ్డు సున్నం చెరువులో పలువురు అక్రమ నిర్మాణాలు చేపట్టి షెడ్లు నిర్మించారని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇటీవల రంగంలోకి దిగిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువును పరిశీలించారు. రెవెన్యూ అధికారుల సాయంతో రికార్డులను పరిశీలించి మెుత్తం 43 ఎకరాల చెరువు కబ్జాకు గురైనట్లు గుర్తించారు. దీంతో నేడు కూల్చివేతలు చేపట్టారు.


ఉదయం పోలీసుల బలగాల సాయంతో చెరువు వద్దకు చేరుకున్న హైడ్రా అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కూల్చివేతలను అడ్డుకునేందుకు పలువురు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇక బాచుపల్లి బొరంపేట చెరువు పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూడా హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని హెచ్‌ఎంటీ, వాణి నగర్ కాలనీల్లోని అక్రమ నిర్మాణాలపై కూడా హైడ్రా అధికారులు బుల్డోజర్లు పంపారు. రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖల సహకరాంతో ఉదయం నుంచి కూల్చివేతలు చేపట్టారు.


మేడ్చల్‌ జిల్లా దుండిగల్‌లో ఆక్రమణల కూల్చివేతకు హైడ్రా సిద్ధమైంది. కత్వా చెరువు ఎఫ్‌టీఎల్‌లో నిర్మించిన విల్లాల కూల్చివేతకు చర్యలు చేపట్టింది. చెరువును కబ్జా చేసి శ్రీలక్ష్మీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్ విల్లాలు చేపట్టిందని గుర్తించారు. ఈ నేపథ్యంలో రూ. కోట్ల విలువైన విల్లాలపై బుల్డోజర్లు పంపేందుకు హైడ్రా అధికారులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో కత్వా చెరువు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు విల్లా ఓనర్లు అక్కడకు చేరుకున్నారు. తాము కోర్డుకు వెళ్లామని.. కోర్డు ఆర్డర్ వచ్చే వరకు కూల్చివేతలు చేపట్టవద్దని హైడ్రా అధికారులను వేడుకుంటున్నారు. అయితే ససమేరా అంటున్న హైడ్రా కూల్చివేతలకు సిద్ధమైంది.


ఇక సీనియర్ నటుడు, నిర్మాత మురళీ మోహన్‌కు చెందిన జయభేరి సంస్థకు సైతం హైడ్రా నోటీసులు జారీ చేసింది. గచ్చిబౌలి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్‌లోని రంగలాల్ కుంట ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో అక్రమ నిర్మాణాలు చేప్టటినట్లు గుర్తించారు. ఈ మేరకు అక్కడ నిర్మించిన అక్రమ నిర్మాణాలు తొలగించాలని నోటీసులు ఇచ్చింది. 15 రోజుల్లోగా కూల్చకపోతే తామే నిర్మాణాలు కూల్చేస్తామని హైడ్రా హెచ్చరించింది. ఇలా అక్రమ కట్టడాలపై ఏమాత్రం వెనక్కి తగ్గని హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది. దీంతో అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారి గుండెళ్లో బుల్డోజర్లు పరుగుడెతున్నాయి.











SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com