ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో మరోసారి వరుణుడు ప్రతాపం.. 3 రోజులు అతి భారీ వర్షాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 07, 2024, 07:22 PM

భారీ వర్షాలు, వరదల నుంచి ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాలు మెల్లగా కోలుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో.. మరోసారి వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణతో పాటు ఏపీలోనూ.. ఆదివారం (సెప్టెంబర్ 8) నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి తోడు ఉపరితల ఆవర్తన ప్రభావం కూడా కొనసాగుతోందని ఐఎండీ వెల్లడించింది. దీంతో.. సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. ఈ మేరకు.. తెలంగాణలోని 19 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాఖాఖాతం మీద విస్తరించిన ఉందని ఐఎండీ పేర్కొంది. దానికి అనుబంధంగా సముద్రమట్టానికి సగటున 7.6 కి.మీ ఎత్తు వరకు ఉపరితల అవర్తనం విస్తరించి ఉందని వివరించారు. ఈ ఉపరితల ఆవర్తనం.. సెప్టెంబర్ 9వ తేదీ నాటికి ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్ తీరంలోని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.


ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. ఉత్తర దిశగా కదులుతూ వాయువ్య, పరిసర మధ్య బంగాళాఖాతంలో ప్రస్పుటమైన అల్పపీడనంగా ఏర్పడిందని అధికారులు వివరిస్తున్నారు. దీని అనుబంధ ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి.. మరింత ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపు వంగి ఉన్నదని చెప్తున్నారు. ఇది ఉత్తర దిశగా కదులుతూ బలపడి.. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలోని వాయువ్య బంగాళాఖాతం వద్ద ఈనెల 8న వాయుగుండంగా మారే ఛాన్స్ ఉంది.


అనంతరం.. ఇది పశ్చిమ- వాయువ్య దిశగా కదులుతూ వచ్చే 3 రోజులలో గంగేటిక్ పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్, పరిసర ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా కొనసాగే అవకాశం ఉంది. రుతుపవన ద్రోణి ఈరోజు (సెప్టెంబర్ 7న) సగటు సముద్ర మట్టానికి బికానర్, కోట, పెండ్రా రోడ్, పరదీప్, వాయువ్య, పరిసర మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ప్రస్పుటమైన అల్పపీడన ప్రాంతం యొక్క కేంద్రం గుండా కొనసాగుతోంది.


దీని ప్రభావంతో.. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఆదివారం ( సెప్టెంబర్ 8) పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. సెప్టెంబర్ 9 నుంచి 3 రోజుల పాటు మళ్లీ తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.


సెప్టెంబర్ 9వ తేదీన ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. సెప్టెంబర్ 10వ తేదీన కూడా పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com