రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాగల రెండురోజలు పాటు అంత్యంత భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ఈ మేరకు రెడ్ అలెర్ట్ను జారీ చేసింది.ఈ క్రమంలో ప్రాణ, ఆస్తి నష్టం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లతో ఆమె టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. డీజీపీ జితేందర్, మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, నీటి పారుదలశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి లోకేశ్ కుమార్, ఫైర్ సర్వీసుల శాఖ డీజీ నాగిరెడ్డి, జీహెచ్ ఎంసీ కమీషనర్ ఆమ్రపాలి కాటా, మున్సిపల్ పరిపాలన విభాగం సంచాలకులు గౌతమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణతో పాటు సరిహద్దుల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయన్నారు.
ఎలాంటి ఆకస్మిక విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ అయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రతీ జిల్లా కలెక్టర్ కార్యాలయంతోపాటు జీహెచ్ఎంసీ, సచివాలయంలోనూ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. లోతట్టు, వరద ప్రజలు వెళ్లకుండా నిఘా వేయాలని చెప్పారు. ఉధృతంగా పారే వాగుల వద్ద ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించి, పర్యవేక్షించాలని చెప్పారు. వర్షాల దృష్ట్యా జిల్లాల్లో పాఠశాలలకు సెలవు దినంగా ప్రకటించుకునే నిర్ణయం జిల్లా కలెక్టర్లు తీసుకోవాలని చెప్పారు. వరద ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను తరలించి పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసే విషయంలో ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. భారీ వర్షాలు, వరదలతోనే తీసుకునే జాగ్రత్తలపై ప్రజలను ఎప్పటికప్పుడు ప్రసార మాధ్యమాల ద్వారా చైతన్య పరచాలన్నారు. గ్రామాలు, పట్టణాలలోని మంచినీటి వనరులైన ట్యాంకులు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని, అంటువ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ పౌడర్, క్లోరినేషన్ చేపట్టాలని ఆదేశించారు.
వైద్య బృందాలను అప్రమత్తం చేశామని, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మందులు సిద్ధంగా ఉంచామని చెప్పారు. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హైదరాబాద్, విజయవాడలో ఉన్నాయని.. ఎలాంటి అవసరం ఉన్నా ముందస్తు సమాచారం ఇస్తే పంపిస్తామన్నారు. గోదావరి, కృష్ణా నదుల పరీవాహక ప్రాంతాల్లోని జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భారీ వరదలు, వర్షాలతో కొన్ని చోట్ల చెరువులకు స్థానికులు గండ్లు పెట్టే అవకాశం ఉందని, దాంతో లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాంటి చర్యలకు పాల్పకుండా నీటిపారుదల శాఖ అధికారులచే పర్యవేక్షించాలని సూచించారు. పోలీస్, నీటిపారుదల శాఖ, విపత్తుల నిర్వహణశాఖ, పంచాయతీ రాజ్శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను అప్రమత్తం చేయడంతో పాటు మ్యాన్హోల్స్ను తెరవకుండా నిఘా వేయాలన్నారు.