అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో రెండో విడత రైతు రుణమాఫీ సీఎం రేవంత్ రెడ్డి అన్నదాతల అకౌంట్లలో డబ్బులు జమ చేశారు. తొలి విడతలో రూ. లక్ష లోపు మాఫీ జరగ్గా.. రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు రుణం ఉన్న రైతుల ఖాతాల్లో నేడు నగదు జమ చేశారు. రెండో విడతలో మొత్తం 6.40 లక్షల మంది రైతుల రుణమాఫీ కోసం ప్రభుత్వం రూ.6,198 కోట్లు వెచ్చించింది.
రెండో విడత రుణమాఫీ కార్యక్రమంలో మాట్లాడిన సీఎం రేవంత్.. రాజకీయ ప్రయోజనం కాదుని రైతు ప్రయోజనం కోసం పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి అభినందనలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. రైతు సంతోషంగా ఉండాలనే తాము 6 మే 2022న వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకటించామన్నారు. గత ప్రభుత్వం 60 నెలలు నాలుగు విడతల్లో రూ.లక్ష రుణమాఫీ కూడా పూర్తిచేయలేకపోయారని ఎద్దేవా చేశారు. రూ.25 వేల కోట్లు కూడా రుణమాఫీ చేయలేకపోయిందన్నారు.
'అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ ప్రభుత్వం ఎలా రుణమాఫీ చేస్తుందని కొందరు మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ చేయాల్సిందేనని ప్రణాళికలు రచించాం. అందుకు నిధులు సేకరించాం. నిధుల సమీకరణ చేసి ఇవాళ రెండో విడతలో రూ.6,198 కోట్లు విడుదల చేశాం. ఆరున్నర లక్షల మందికి మేలు జరిగేలా చేస్తున్నాం. ఇది మా చిత్తశుద్ధి, నిబద్ధత. అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ కాంగ్రెస్ రైతు పక్షపాతి. నెల తిరిగేలోగా 1.5లక్షల వరకు రైతు రుణమాఫీ చేసి మా చిత్తశుద్ధి నిరూపించుకున్నాం.' అని రేవంత్ వ్యాఖ్యనించారు.
ఇక మూడో విడత రుణమాఫీపై కూడా సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆగస్టులోగా రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేసి రైతులను రుణ విముక్తులను చేస్తామన్నారు. జులై, ఆగస్టు నెలలు చరిత్రలో లిఖించదగ్గ నెలలని చెప్పారు. దేశ చరిత్రలోనే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ రికార్డు సృష్టించిందని వెల్లడించారు. స్వతంత్ర భారతంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్దమొత్తంలో రైతు రుణమాఫీ చేయలేదన్నారు. గత బీఆరెస్ ప్రభుత్వం చేసిన అప్పులకు ఈ ఆరు నెలల్లో రూ.43 వేల కోట్లు వడ్డీకే చెల్లించామన్నారు. 12 రోజుల్లోనే రుణమాఫీకి రూ.12 వేల కోట్లు సేకరించినట్లు చెప్పారు. కాగా, ఆగస్టు 15 లోపు మూడో విడత రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ గతంలో ప్రకటించారు. అయితే తాజాగా.. ఆయన ఆగస్టులోపు చేస్తామని చెప్పటంతో అవుతుందా? కాదా అని టెన్షన్ రైతుల్లో నెలకొంది.