మూడ్రోజుల క్రితం పలు రాష్ట్రాలకు రాష్ట్రపతి కొత్త గవర్నర్లను నియమించగా..తెలంగాణ నూతన గవర్నర్గా త్రిపుర మాజీ డిప్యూటీ సీఎం జిష్ణుదేవ్ వర్మ నియమితులైన విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణ ఇంఛార్జ్ గవర్నర్గా ఉన్న జార్ఘండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ను మహారాష్ట్రకు బదిలీ చేశారు. తెలంగాణ పూర్తిస్థాయి గవర్నర్గా జిష్ణుదేవ్ను నియమించారు. అయితే గవర్నర్గా తన నియామకానికి ముందు జరిగిన విషయాలను జిష్ణు దేవ్ తాజాగా మీడియాకు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తనకు ఫోన్ చేసి షాక్ ఇచ్చినట్లు చెప్పారు.
తెలంగాణ గవర్నర్గా తనను నియమిస్తారని అస్సలు ఊహించలేదని అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటనకు కొద్ది గంటల ముందే తనకు పీఎంవో నుంచి కాల్ వచ్చిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తనతో ఫోన్లో మాట్లాడినట్లు వెల్లడించారు. శనివారం రాత్రి ఫోన్ చేసిన మోదీ.. త్రిపుర రాష్ట్రం బయట పని చేయాల్సి ఉంటుందని చెప్పారరన్నారు. అందుకు తాను బదులిస్తూ.. ఏ బాధ్యత అప్పగించినా చేస్తానని మోదీతో వెల్లడించినట్లు తెలిపారు. ప్రధాని మోదీ ఫోన్ చేసిన మాట్లాడిన కొద్ది నిమిషాలకే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని చెప్పారు. తెలంగాణకు సుస్వాగతం అని రేవంత్ రెడ్డి అనటంతో తనకు విషయం పూర్తిగా అర్ధమైందని చెప్పారు.
తనను తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్గా నియమిస్తున్నారనే విషయంపై స్పష్టత వచ్చిందన్నారు. త్రిపుర రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు గవర్నర్గా ఎవరూ పని చేయలేదని.. అలా నియమితులైన తొలి వ్యక్తి తానేనని చెప్పుకొచ్చారు. రాజ్యాంగబద్ధ పాలన జరిగేట్లు చూసే క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సమన్వయంతో పని చేస్తానని అన్నారు. తాను తెలంగాణ గవర్నర్గా వెళ్లినప్పటికీ.. పుట్టి పెరిగిన త్రిపురకు సాయం చేయాల్సి వస్తే అందరికంటే ముందుంటానని అన్నారు.
కాగా, జిష్ణుదేవ్వర్మ 1957 ఆగస్టు 15న త్రిపుర రాజ కుటుంబంలో జన్మించారు. ఆయన రామ జన్మభూమి ఉద్యమ సమయంలో 1990లో బీజేపీలో చేరారు. అప్పటి నుంచి బీజేపీలో క్రియాశీలకంగా కొనసాగారు. త్రిపుర రెండో ఉప ముఖ్యమంత్రిగా 2018 నుంచి 2023 వరకు పని చేశారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగానూ సేవలందించారు. గతేడాది జరిగిన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా తెలంగాణ మూడో పూర్తిస్థాయి గవర్నర్గా నియమితులయ్యారు.