రేవంత్ రెడ్డి సర్కార్.. మరో రికార్డు సృష్టించింది. గత కేసీఆర్ ప్రభుత్వ రికార్డును రేవంత్ రెడ్డి ప్రభుత్వం బ్రేక్ చేసింది. ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో.. అధికార ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలో సభ దద్దరిల్లిపోతోంది. బయట వర్షపు జల్లులతో వాతావరణం కూల్ కూల్గా ఉన్నా.. సమావేశాలు మాత్రం హాట్ హాట్గా సాగుతున్నాయి. అయితే.. రేవంత్ రెడ్డి సర్కార్ ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్పై చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. సమావేశాలు కొత్త రికార్డు సృష్టించాయి. మధ్య రాత్రి అయినా సరే కూర్చొని కూలంకశంగా సభలో చర్చిద్దామంటూ పదే పదే చెప్పే సీఎం రేవంత్ రెడ్డి.. అందుకు తగ్గట్టుగానే సుదీర్ఘంగా సభను నిర్వహించి తన మార్క్ రికార్డు క్రియేట్ చేశారు.
సోమవారం (జులై 29న) రోజున నిర్వహించిన ఐదో రోజు సమావేశం.. సుదీర్ఘంగా సాగాయి. ఉదయం మొదలైన సభ.. తెల్లవారుజాము వరకు కొనసాగటం విశేషం. ఏకంగా 17 గంటలకుపైగా శాసనసభ జరిగింది. ఉదయం 10 గంటలకు మొదలైన శాసనసభ.. మంగళవారం వేకువజాము 3 గంటల 15 నిమిషాల వరకు జరిగింది. అయితే.. గతంలో కేసీఆర్ సర్కార్.. 12 గంటల పాటు సభను సుదీర్ఘంగా నడపగా.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ రికార్డును బ్రేక్ చేసింది.
బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో.. ఒకే రోజు 19 పద్దులపై చర్చ జరిపి అప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో సర్కార్ సుదీర్ఘంగా సభను కొనసాగించింది. ఈ క్రమంలోనే.. మంగళవారం ఉదయం 3 గంటల వరకు అసెంబ్లీ నడిపారు. సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో 19 పద్దులకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ 19 పద్దులపై సభలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలపై ఐదుగురు మంత్రులు తమ సమాధానాలు ఇచ్చారు.
ఈ క్రమంలో.. అసెంబ్లీలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య వాడీ వేడి చర్చ నడిచింది. ముఖ్యమంగా పవర్, లా అండ్ ఆర్డర్, రవాణా లాంటి అంశాలపై సభలో హోరాహోరీగా చర్చ సాగింది. అధికార ప్రతిపక్ష సభ్యల మధ్య ఘాటు విమర్శలు, తీవ్ర ఆరోపణలతో సభ అట్టుడికింది. ముఖ్యంగా.. పవర్ విషయంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం నడిచింది. మరోవైపు.. కాంగ్రెస్ ప్రభుత్వానికి మిత్రపక్షమైన ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కూడా హైదరాబాద్ శాంతి భద్రతల విషయంలో హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సైతం శాంతి భద్రతలపై ప్రభుత్వంపై విమర్శలు చేశారు.