ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సరదాగా ఈతకు వెళ్లి,,,అమెరికాలో హైదరాబాద్‌ యువకుడు మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 29, 2024, 08:11 PM

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన మరో తెలుగు విద్యార్థి సరదాగా స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి మృత్యువాతపడ్డాడు. గత శనివారం (జులై 21) జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతదేహం వారం రోజుల తర్వాత శనివారం (జులై 27) హైదరాబాద్ తీసుకురాగా.. స్వగ్రామంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. వివరాల్లోకి వెళ్తే... మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల గ్రామానికి చెందిన గోపాల్‌రెడ్డి, సమంత దంపతులు. వీరు గత 25 ఏళ్ల క్రితం కాటేదాన్‌ ప్రాంతానికి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. ఈ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు, కుమారుడు అక్షిత్‌ రెడ్డి(26) సంతానం. గోపాల్‌ రెడ్డి డీసీఎం డ్రైవర్‌గా పని చేస్తుండగా.. ఇద్దరు కుమార్తెలకు వివాహాలు జరిపించాడు.


కుమారుడుడు అక్షిత్ రెడ్డిని మూడేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికా పంపించాడు. అక్షిత్ చికాగోలో ఉంటూ ఎమ్మెస్‌ పూర్తి చేశాడు. అనంతరం అక్కడే ఓ సాప్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. మరో రెండు నెలల్లో అక్షిత్ రెడ్డి ఇండియాకు రావాల్సి ఉంది. ఇండియాకు రాగానే.. డిసెంబరులో పెళ్లి చేయాలని తల్లిదండ్రులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలోనే తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అక్షిత్‌ రెడ్డి గత శనివారం సాయంత్రం తన ఇద్దరు స్నేహితులతో కలిసి చికాగోలోని లేక్‌ మిశిగన్‌లో సరదాగా ఈతకు వెళ్లాడు. ముగ్గురు స్నేహితుల్లో ఒకరు ఒడ్డున ఉండగా.. మరో ఇద్దరు చెరువులోకి దిగి స్నానం చేస్తున్నారు. చెరువు మధ్యలోని ఓ రాయి వద్దకు వెళ్లాలని ముగ్గురు పందెం కాసుకున్నారు. అతి కష్టమ్మీద ఓ స్నేహితుడు రాయివరకు చేరుకున్నాడు.


అక్షిత్‌ రెడ్డి మాత్రం అలసటతో మధ్యలోనే అలిసిపోయాడు. ఒడ్డుకు తిరిగి వస్తుండగా.. అలసట ఎక్కువై నీటిని మింగేశాడు. ఓ నిమిషం పాటు నీటిలో కొట్టుమిట్టాడి మునిగిపోయాడు. స్నేహితుడు సైతం తిరిగి బయటకు వచ్చే క్రమంలో చెరువులో మునిగిపోయాడు. గమనించిన స్థానికులు అతడిని కాపాడారు. అక్షత్ మాత్రం ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు గాలించి అక్షిత్‌రెడ్డి మృతదేహాన్ని బయటకు తీశారు. శనివారం రాత్రి అక్షిత్‌రెడ్డి మృతదేహం కాటేదాన్‌కు చేరుకుంది. అనంతరం మరుసటి రోజు స్వగ్రామం అడ్డాకులలో అంత్యక్రియలు పూర్తిచేశారు. కుమారుడి మృతితో వారి కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com