ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాతబస్తీ గల్లీల్లో ఉంటా.. ఎవరొస్తారో రండి.. అక్బరుద్దీన్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 29, 2024, 07:33 PM

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవేసీ రేవంత్ రెడ్డి సర్కారుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నిన్ననే దోస్త్ అంటూ మిత్రపక్షంగా వ్యవహరించిన అక్బరుద్ధీన్.. పాతబస్తీలో శాంతిభద్రతల విషయంలో మాత్రం ఏరేంజ్‌లో నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి సర్కారురుకు వార్నింగ్ కూడా ఇచ్చారు. పాతబస్తీ గల్లీల్లో తానే స్వయంగా నిలబడతానని.. ఎవరు వస్తారో రండి అంటూ సవాల్ విసిరారు. లా అండ్ అర్డర్ సమస్య వస్తే మాత్రం తాను బాధ్యుడిని కాదంటూ హెచ్చరిక చేయటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.


"కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ బ్రాండ్‌ను ఖరాబ్ చేస్తుంది. ఇంటి ముందు ఉన్న జనాలను కూడా పోలీస్ వాళ్లు లాఠీతో కొడుతున్నారు. కొందరైతే ఇళ్లల్లో దూరిమరి కొడుతున్నారు. అలా కొట్టడం సరి కాదు. అదే పోలీస్ వాళ్లు మన ఎమ్మెల్యేల పిల్లలను కొడితే సైలెంట్‌గా ఉంటామా..? నిరుపేదల పిల్లలను ఇష్టమొచ్చినట్టు కొడుతున్నారు. ఇక నుంచి.. వాళ్లు నా పిల్లలు. రేపటి నుంచి ఓల్డ్ సిటీ గల్లీల్లో రాత్రి పది గంటల తర్వాత నేనే ఉంటా. ఎవరు వస్తారో చూస్తా. ఏదైనా లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే నేను బాద్యుడిని కాదు. ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మేము గాంజా, మందు బంద్ చేయించమంటున్నాం. గరీబ్ పిల్లలను కొట్టొద్దు అంటున్నాం." అంటూ అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు.


రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంపై చర్చ సందర్భంగా మాట్లాడిన అక్బరుద్ధీన్ ఒవైసీ.. హైద‌రాబాద్‌‌లో ప్రభుత్వం పూర్తిగా విఫ‌లం అయ్యిందని మండిపడ్డారు. రోజురోజుకు నేరాలు పెరిగిపోతూనే ఉన్నాయని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్ సమస్య గురించి నిన్న తాను, హరీష్ రావు మాట్లాడితే ప్రభుత్వం సమాధానం ఇచ్చిందని పేర్కొన్న అక్బరుద్ధీన్.. ఈ గ్యాప్‌లోనే నగరంలో 3 హత్యలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. దీన్ని బట్టే అర్థమవుతోంది.. హైదరాబాద్ నగరంలో లా అండ్ ఆర్డర్ ఎంతగా పని చేస్తోందన్నది అంటూ విమర్శలు గుప్పించారు.


టాస్క్ ఫోర్స్ పోలీసుల పని నేరస్థులను పట్టుకోవడం అని.. కానీ వాళ్లు రాత్రి అయితే కనిపించిన వాళ్లందరి మీద లాఠీఛార్జ్ చేస్తున్నారంటూ అక్బరుద్దీన్ మండిపడ్డారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులన్నది క్రిమినల్స్‌ను పట్టుకోవడానికని.. సామాన్యులపై లాఠీ ఛార్జ్ చేయడానికి కాదని హెచ్చరించారు. పోలీసులు రాత్రిపూట డ్యూటీలు చేస్తూ పగటి పూట పడుకుంటున్నారని.. అందుకే హత్యలు పగటిపూట జరుగుతున్నాయ‌ని ఎత్తిపొడిచారు.


అత్యవ‌స‌ర ప‌రిస్థితుల్లో రాత్రి స‌మ‌యాల్లో ఆస్పత్రుల‌కు వెళ్తున్న వారిపై, ఐటీ ఉద్యోగులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. సామాన్యులపై లాఠీఛార్జ్ చేయడం కాకుండా క్రిమినల్స్‌ మీద.. గంజాయి తరలించేవాళ్లను కొట్టాలంటూ అక్బరుద్దీన్ సూచించారు. మరోవైపు.. హైదరాబాద్‌లో ప్రతి పోలీస్ స్టేషన్‌కు మామూళ్లు వెళ్తున్నాయంటూ అక్బరుద్దీన్ కీలక ఆరోపణలు చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com