తెలంగాణలో ప్రస్తుతం రెగ్యూలర్గా వర్షాలు కురవటం లేదు. వర్షాకాలం సగం సీజన్ అయిపోవస్తున్నా.. అడపాదడపా మాత్రమే వర్షాలు కురుస్తున్నాయి. విత్తనాలు విత్తిన రైతులు వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. వరుణుడి కరుణ కోసం ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రైతన్నలకు శుభవార్త చెప్పారు. నేటి నుంచి మరో మూడ్రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయన్నారు.
ప్రస్తుతం నైరుతి రుతపవనాలు రాష్ట్రం అంతటా విస్తరించి ఉన్నాయి. ఈ పవనాలతో పాటు ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయన్నారు. నేడు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, కరీంనగర్, పెద్దపల్లి, హన్మకొండ, సంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు.
కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో పాటు భారీ ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయన్నారు. కాగా, గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.