ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డ్రగ్స్ విష ప్రయోగం లాంటిది.. డ్రగ్ ముఠాల వెనుక దేశ ద్రోహులు: డిప్యూటీ సీఎం భట్టి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 25, 2024, 07:58 PM

మాదకద్రవ్యాలు అత్యంత ప్రమాదకరమని.. తెలంగాణలో మాదకద్రవ్యాలు నిరోధించడానికి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భట్టితో పాటు సీఎస్ శాంతి కుమారి, డీజీపీ రవి గుప్త ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన భట్టి.. డ్రగ్స్ విష ప్రయోగం లాంటిదని.. కుటుంబ వ్యవస్థలను విచ్చిన్నం చేస్తుందన్నారు. డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న సంఘ విద్రోహ శక్తులు చేతిలో యువత జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయని చెప్పారు.


'తెలిసీ తెలియని వయసులో పిల్లలు డ్రగ్స్ తీసుకుంటూ వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొందరు కావాలని తమ అక్రమ ఆదాయం కోసం పిల్లలకు యువతకు డ్రగ్స్ అంటగడుతున్నారు. దేశాన్ని బలహీన పరచడానికి దేశద్రోహులు చేస్తున్న ప్రయత్నంగా కూడా డ్రగ్స్‌ను చూడొచ్చు. అందుకే రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మనపైనే ఉంది. డ్రగ్స్ నిర్మూలనకు నార్కొటిక్ బ్యూరోకు ఎంతైనా బడ్జెట్ ఇస్తాం. రాష్ట్రంలో మాదకద్రవ్యాలు వినియోగం రవాణా లేకుండా చేయాల్సిన బాధ్యత నార్కోటిక్ బ్యూరోదే. అడిగిన వెంటనే నార్కోటిక్ బ్యూరోకు లేదు అనకుండా అన్ని సమకూర్చాం. భవిష్యత్తులో కూడా ఇస్తాం.


మాదకద్రవ్యాలు నిరోధానికి కేవలం పోలీస్ ప్రభుత్వ యంత్రాంగం మాత్రమే కాకుండా ప్రజలు కూడా సహకారం అందించాలి. ప్రజలు కమిటీలు వేసుకుని ఎక్కడికక్కడ సమాచారం అందిస్తే.. డ్రగ్స్ అరికట్టడం కష్టమేమీ కాదు. డ్రగ్స్ ఫెడ్లర్‌లను ఎక్కడికైనా వెళ్లి అరెస్ట్ చేయడానికి పోలీస్ వ్యవస్థకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అందుకే మనం పోలీసులకు సహకారం అందించాలి. పోలీసులకు సమాచారం ఇచ్చే వ్యవస్థను బలోపేతం చేసుకోవాలి. అన్ని గ్రామాల్లో మాదకద్రవ్యాల నిరోధక కమిటీలను వేసుకోవాలి. గ్రామాల్లో కొత్త వ్యక్తులపై నిఘ ఎల్లప్పుడూ ఉండాలి.


విద్యార్థులు, పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలకు ఖర్చు పెడుతుంది. విద్యార్థులు తాత్కాలిక సంతోషాల జోలికి వెళ్లి బలికావొద్దు. విద్యార్థులు అడ్డదారులు తొక్కితే కుటుంబమే కాకుండా సమాజం మొత్తం బాధపడాల్సి వస్తుంది. డ్రగ్స్ నిరోధానికి ఏ స్థాయిలో అయినా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.' అని భట్టి విక్రమార్క వెల్లడించారు.











SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com