బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసు విషయంలో తన ప్రమేయం ఏమీ లేదంటూ సోమవారం రోజున ఉన్నత న్యాయస్థానంలో కేసీఆర్ పిటిషన్ వేశారు. 2011లో జరిగిన రైలు రోకో సందర్భంగా పోలీసులు తనపై పెట్టిన కేసు ప్రస్తుతం ప్రజాప్రతినిధుల కోర్టులో ఉండగా.. దాన్ని కొట్టేయాలంటూ పిటిషన్లో కేసీఆర్ కోరారు.
తెలంగాణ ఉద్యమంలో భాగంగా.. రైల్ రోకోకు కేసీఆర్ పిలుపునిచ్చారంటూ పోలీసులు ప్రజాప్రతినిధుల కోర్టుకు నివేదిక అందజేశారు. 2011 అక్టోబర్ 15, 16, 17 తేదీల్లో రైల్ రోకోకు కేసీఆర్.. పిలుపునిచ్చారంటూ నివేదికలో పోలీసులు తెలిపారు. రైలు రోకో వల్ల రైళ్ల రాకపోకలకు, రైల్వే ఉద్యోగుల విధులకు తీవ్ర ఆటంకం కలిగిందని.. పోలీసులు వివరించారు.
అయితే.. ఈ పిటిషన్పై స్పందించిన కేసీఆర్.. తాను ఎలాంటి రైలు రోకోకు పిలుపునివ్వలేదని ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఎవరో ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు తనపై కేసులు నమోదు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. రైల్ రోకో ఘటన తర్వాత మూడేళ్లకు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని కేసీఆర్ వివరించారు. ఆ కేసులో ఎలాంటి బలం లేదని.. దాన్ని కొట్టేయాలంటూ ఉన్నత న్యాయస్థానానికి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.