ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరికొన్ని గంటల్లో పెళ్లి.. వరుడికి షాకిచ్చిన వధువు, సీసీ ఫుటేజ్ చూసి అవాక్కు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 25, 2024, 07:56 PM

కళ్యాణ మండపంలో పెళ్లికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.. మరో ఐదారు గంటల్లో పెళ్లికి ముహూర్తం. ఇంతలో ఊహించని ఘటన జరిగింది.. పెళ్లి కూతురు కనిపించడం లేదని తెలిసింది. మండపంలో అన్ని గదుల్లో వెతికినా ఆమె కనిపించలేదు.. అనుమానంతో సీసీ ఫుటేజ్ పరిశీలిస్తే అప్పుడు అసలు సంగతి తెలిసింది. సినిమా రేంజ్ ట్విస్ట్‌తో అందరూ అవాక్కయ్యారు. కర్నూలు జిల్లాలో ఈ ఘటన జరగ్గా.. పెళ్లి మధ్యలోనే ఆగిపోయింది.


కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం లక్కసాగరానికి చెందిన బజారి కుమారుడికి.. అనంతపురానికి చెందిన నరేంద్ర కుమార్ కుమార్తె వైష్ణవికి పెద్దలు పెళ్లి నిశ్చయించారు. పత్తికొండలోని గోపాల్ ప్లాజా కళ్యాణ మండపంలో పెళ్లికి భారీగా ఏర్పాట్లు చేశారు. వధువు, వరుడు.. వారి కుటుంబ సభ్యులు మండపానికి చేరుకున్నారు.. తెల్లవారితే పెళ్లి కాగా.. ఇంతలోనే ఊహించని పరిస్థితి ఎదురైంది.


కళ్యాణ మండపంలో వధువు కనిపించకుండా పోయింది.. అన్ని చోట్లా వెతికినా ఆమె జాడ కనిపించలేదు. వెంటనే కళ్యాణ మండపంలో సీసీ ఫుటేజ్ పరిశీలిస్తే ఆమె మరో అబ్బాయితో కలిసి బయటకు వెళుతున్నట్లు గుర్తించారు. ఆమెకు ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో ప్రేమించిన యువకుడితో వెళ్లిపోయి ఉంటుందని అనుమానించారు. యువతి మండపం నుంచి వెళ్లిపోవడంతో పెళ్లి ఆగిపోయింది.. దీంతో వధువు తండ్రి కన్నీటి పర్యంతం అయ్యారు. కళ్యాణ మండపానికి వచ్చిన బంధువులు కూడా వెనక్కు వెళ్లిపోయారు. వెంటనే వధువు తరఫు బంధువులు పత్తికొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారం ఆ యువకుడి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com