ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో ఏపీ ప్రభుత్వ స్కీం.. పేదవాడి ఆకలి తీర్చేందుకు, త్వరలోనే ప్రారంభం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 23, 2024, 04:10 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ రాష్ట్రంలో అమలు చేయనున్న ఓ సంక్షేమ పథకం తెలంగాణలోనూ అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. పేదవాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను తెరిచేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. పాత క్యాంటీన్లు తెరవడంతో తాజాగా మరికొన్ని కొత్తగా క్యాంటీన్లు ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. చంద్రబాబు తన మానసపుత్రికగా చెప్పుకునే అన్న క్యాంటీన్‌ను హైదరాబాద్‌లోనూ ప్రారంభించనున్నారు.


హైటెక్ సిటీ ప్రాంతంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయనున్నట్లు సీబీఎన్ ఫోరం వ్యవస్థాపకుడు, జెనెక్స్ సంస్థ అధినేత అమర్ ప్రకటించారు. మాదాపూర్‌ 100 ఫీట్‌ రోడ్డులో ఇప్పిటికే క్యాంటీన్‌ నిర్మాణ పనులు పూర్తయ్యయాని చెప్పారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఈ అన్న క్యాంటీన్లు ఎందరో పేదల ఆకలి తీర్చాయని అమర్ వెల్లడించారు. చంద్రబాబు స్ఫూర్తితో తెలంగాణలోనూ అన్న క్యాంటీన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. జులై మొదటి వారంలో ఈ క్యాంటీన్ ప్రారంభిస్తామని చెప్పారు.


 కాగా, 2014-19లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఏపీలో అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. ఈ క్యాంటీన్లలో నిత్యం 30 వేల నుంచి 35 వేల మంది భోజనం చేసేవారు. రూ.5కు అల్పాహారంతో పాటు మధ్యాహ్నం, రాత్రి రుచికరమైన భోజనం అందించేవారు. ఆటో, రిక్షానడిపేవారు, కూలీలు, హమాలీలు, చిరుద్యోగులు వీటిని ఆశ్రయించి తమ ఆకలి తీర్చుకునేవారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. జగన్ ప్రభుత్వం వీటిని మూసివేసింది. తాజాగా.. చంద్రబాబు తిరిగి అధికారంలోకి రావటంతో తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టగానే.. అన్న క్యాంటీన్లు ప్రారంభించేందుకు ఆయన సంతకం చేశారు. ఈ మేరకు వాటిని రీ ఓపెన్ చేసేందుకు అధికారులు సిద్దమయ్యారు.


ఇక తెలంగాణలోనూ రూ. 5 భోజనం అందిస్తున్నారు. హ‌రేకృష్ణ మూమెంట్ ఛారిట‌బుల్ ఫౌండేష‌న్ సహకారంతో హైదరాబాద్‌తో పాటు పలు పట్టణాల్లో అన్నపూర్ణ పథకం పేరుతో రూ. 5 కే భోజనం అందిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 373 కేంద్రాల ద్వారా రోజుకు దాదాపుగా 80 వేల మందికి రుచికరమైన భోజనం అందిస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com