ప్రస్తుతం యువతలో చాలా మంది.. రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోయేందుకు తహతహలాడుతున్నారు. చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకు సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోవటంతో.. ఆ క్రేజ్ను ఉపయోగించుకుని ఓవర్ నైట్ స్టార్ కావాలని పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్ని చేస్తున్నారు. కొందరు డీసెంట్గా యూట్యూబ్ వీడియోలు చేస్తూ.. అటు వాళ్ల ట్యాలెంట్ను ప్రదర్శించుకుంటూనే.. మరోవైపు డబ్బు కూడా సంపాదించుకుంటున్నారు. మరికొందరు మాత్రం.. వెంటనే వైరల్ అయిపోయి పేమస్ అయిపోదామని.. యూట్యూబ్ షార్ట్స్, ఇన్ స్టాలో రీల్స్ కోసం రిస్కులు చేస్తూ.. ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ యువకుడు.. రీల్స్ పిచ్చితో రియల్గానే ఉరేసుకుని ప్రాణాలు కోల్పోయాడు.
వరంగల్ జిల్లా నర్సంపేటలో అజయ్ అనే 23 ఏళ్లు యువకుడు.. ఇన్స్టాగ్రాంలో తరచూ రీల్స్ చేస్తుంటాడు. వినూత్న పద్ధతిలో రీల్స్ చేసి.. లక్షల్లో వ్యూస్, లైక్స్ తెచ్చుకుని ఓవర్ నైట్ స్టార్ అయిపోదామని రకరకాల ప్రయత్నాలు చేసేవాడు. ఈ క్రమంలోనే.. ఉరేసుకున్నట్టు రీల్స్ చేయాలనుకున్నాడు అజయ్. నర్సంపేటలోని తన చిన్నక్క ఇంటికి వెళ్లిన అజయ్.. అక్కడే ఈ రీల్ చేశాడు. మెడకు తాడు బిగించుకుని.. సెల్ఫోన్లో చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో.. ఫ్రిజ్ మీద సెల్ ఫోన్ పెట్టి.. దూలానికి ఉరి వేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా మెడకు తాడు బిగుసుకుపోయింది. ఈ ఘటనలో అజయ్ మృతి చెందాడు. అయితే అజయ్ గతంలో కూడా "3" మూవీలో హీరో ధనుష్ మానసిక పరిస్థితిని అనుకరిస్తూ ప్రమాదకరమైన రీల్స్ చేశాడు. ఈ ఘటన సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటన.. రీల్స్ కోసం రిస్క్ చేసే వారికి ఓ వార్నింగ్లా మారింది.
మూడు రోజుల క్రితమే (జూన్ 17న).. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఓ యువతి.. ఇలా రీల్స్ పిచ్చిలో డ్రైవింగ్ రాకుండా... కొండపై కారు నడిపి నేరుగా లోయలో పడి ప్రాణాలు ఒదిలిన విషయం తెలిసిందే. బ్రేక్ వేయాల్సిన సమయంలో తెలియక యాక్సిలరేటర్ తొక్కటంతో.. కారుతో సహా ఆ అమ్మాయి.. అందరూ చూస్తుండగానే లోయలో పడిపోవటం అందరినీ హతాశుల్ని చేసింది. ఇదిలా ఉంటే.. అదే మహారాష్ట్రలో పుణేలో ఓ అమ్మాయి... ఏత్తైన భవనం చివరి నుంచి మరోవ్యక్తి చేయి పట్టుకుని వేలాడుతూ వీడియో తీయించుకుంది. పట్టుసడలితే.. కిందికి చేరేలోపే ప్రాణాలు పైకి పోయే ఈ రిస్క్ చూసి.. నెటిజనులంతా తిట్టిపోస్తున్నారు.