ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్తగూడెంలో రైలు, ఫ్లాట్‌ఫాం మధ్య ఇరుక్కుని జబర్దస్త్ ఆర్టిస్ట్ మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 22, 2024, 08:30 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించి.. రైలు, పట్టాల మధ్య ఇరుక్కుని ఓ టీవీ ఆర్టిస్టు ప్రాణాలు కోల్పోయాడు. మేదర మహ్మద్దీన్‌ది చుంచుపల్లి మండలం నందాతండా కాగా.. భద్రాచలం రోడ్‌ రైల్వే స్టేషన్‌కు శుక్రవారం ఉదయం వచ్చారు.‌ కాకతీయ ఎక్స్‌ప్రెస్‌ స్టేషన్‌లో నుంచి ముందుకు కదులుతోంది.. ఆ రైలును ఎక్కేందుకు ప్రయత్నించారు. మహ్మద్దీన్ ప్రమాదవశాత్తూ కిందకు జారిపడటంతో రైలు, ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కుపోయాడు. వెంటనే గమనించిన కొందరు ప్రయాణికులు చైన్ లాగడంతో లోకో పైలెట్ రైలును ఆపారు.


సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, సిబ్బంది.. మహ్మద్దీన్‌ను బయటకు తీసి 108 వాహణంలో కొత్తగూడెం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మహ్మద్దీన్ నడుము, పక్కటెముకలకు తీవ్రగాయాలు కాగా.. డాక్టర్లు వైద్యం అందించారు. అయితే మెరుగైన వైద్యం అందించాలని కొత్తగూడెం ఆస్పత్రి డాక్టర్లు తెలియజేయడంతో.. కుటుంబ సభ్యులు ఆయన్ను ఖమ్మం తరలించారు. అయితే మార్గం మధ్యలో మహ్మద్దీన్ ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని సర్వజన ఆస్పత్రికి తరలించారు.. అక్కడ ఆస్పత్రిలో డ్యూటీ వైద్యురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.


మహ్మద్దీన్ టీవీ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నారు.. ఈటీవీ జబర్దస్త్‌ షోలో కూడా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 50 ఎపిసోడ్‌లలో నటించారు. అయితే తనకు హైదరాబాద్‌లో షూటింగ్‌ ఉందని చెప్పి రైల్వే స్టేషన్‌కు వచ్చారు. అయితే ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. మృతుడికి భార్య, డిగ్రీ, పదోతరగతి చదివే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మహ్మద్దీన్‌ మృతితో నందాతండాలో విషాదచాయలు అలుముకున్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తూ కుమార్తెల్ని చదవిస్తున్నారు.. ఇలా ప్రమాదవశాత్తు మరణించడం విషాదాన్ని నింపింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com