తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నేడు, రేపు (నవంబర్ 30) పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ జిల్లా ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తున్న పలువురు కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ విద్యాసంస్థలకు రెండురోజులు సెలవులు ప్రకటిస్తూ హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ ఉత్తర్వులిచ్చారు. పోలింగ్ రోజున కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలలకు మరికొన్ని జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. పోలింగ్ కేంద్రాలుగా లేని, వాటిల్లోని ఉపాధ్యాయులకు ఎన్నికల విధులు లేకుంటే అవి పనిచేస్తాయని అధికారులు తెలిపారు.
ఇక ఎన్నికల విధుల్లో పాఠశాల, ఇంటర్ విద్యాశాఖ, సాంకేతిక, ఉన్నత విద్యాశాఖల సిబ్బంది పాల్గొంటున్నారు. ఈనెల 30న అర్ధరాత్రి వరకు వారు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వారికి డిసెంబరు 1న ప్రత్యేక సెలవు (స్పెషల్ క్యాజువల్ లీవ్) ఇస్తూ పలు జిల్లాల కలెక్టర్లు ఆదేశాలిచ్చారు. పోలింగ్ కేంద్రాల నుంచి స్వస్థలాలకు చేరుకోవటం తదితర కారణాలతో డిసెంబర్ 1న వారికి ప్రత్యేకంగా సెలవు ప్రకటించారు. మిగతా స్కూళ్లు, కాలేజీలు యథావిధిగా డిసెంబర్ 1న ఓపెన్ కానున్నాయి.
ఇక తెలంగాణ ఎన్నికల సందర్భంగా పోలింగ్ జరిగే గురువారం (నవంబర్ 30న) సెలవులు ఇవ్వని సంస్థలపై ఎన్నికల చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో పాటు ఐటీ సంస్థలకు కూడా ఇవి వర్తిస్తాయని చెప్పారు. దీన్ని ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం తీవ్ర నేరంగా పరిగణించాల్సి వస్తుందని వెల్లడించారు. ఐటీ సంస్థలు సెలవు ప్రకటించాయా ? లేదా ? అన్న అంశాన్ని పరిశీలించాల్సిందిగా కార్మికశాఖను ఎన్నికల సంఘం ఆదేశించింది. కాగా, పోలింగ్ సందర్భంగా ఇప్పటికే రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. వైన్స్, బార్లు మూసివేశారు. కేంద్ర బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేసారు.