కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో తెలంగాణలో కొత్త రహదారుల నిర్మాణం జరుగుతోంది. కొత్తగా రైల్వే ప్రాజెక్టులు కూడా మంజూరయ్యాయి. హైదరాబాద్ నుంచి కరీంనగర్ను కలిపేలా మనోహరాబాద్- కొత్తపల్లి రైలు మార్గం నిర్మిస్తున్నారు. ఈ మార్గంలో 13 స్టేషన్లు ఏర్పాటుకానుండగా.. సిద్దిపేట సమీపంలోని కొమురవెల్లిలోనూ స్టేషన్ నిర్మించాలని రైల్వేశాఖ తాజాగా నిర్ణయించింది. అయితే ఈ మార్గంలో మిడ్ మానేరుపై రోడ్ కం రైలు వంతెన నిర్మాణం జరిగేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇదే ఆలోచనని రాష్ట్ర ప్రభుత్వం రైల్వేశాఖ దృష్టికి తీసుకెళ్లింది. ఇటీవలే గజ్వేల్ నుంచి సిద్దిపేట వరకు నిర్మాణం పూర్తయిన ఈ లైన్పై గూడ్స్ రైళ్లు నడుస్తున్నాయి. సిద్దిపేట నుంచి సిరిసిల్ల వరకు భూసేకరణ పూర్తి కావడంతో నిర్మాణ పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది.
సిరిసిల్ల నుంచి వేములవాడ మీదుగా కొత్తపల్లి వరకు భూసేకరణ పూర్తి చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ మార్గంలోనే మిడ్మానేరుపై రోడ్ కం రైలు వంతెన నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. ముందుగా మిడ్మానేరుపై కేవలం ట్రైన్ వంతెన మాత్రమే నిర్మించాలని అనుకున్నారు. ఈ ప్రాజెక్టుపై జరిగిన చర్చలో మిడ్మానేరుపై ట్రైన్ వంతెనతో పాటు రోడ్డు మార్గం కూడా ఉంటే బాగుంటుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, మంత్రి కేటీఆర్ భావించారు. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన దానికి అంగీకరించారు. దీంతో వినోద్ కుమార్ రైల్వే అధికారులతో మాట్లాడారు. త్వరలో సీఎస్ శాంతికుమారి, వినోద్కుమార్, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల కలెక్టర్లు ఈ అంశంపై సమావేశం కానున్నట్లు తెలిసింది. ఈ రోడ్కం రైలు బ్రిడ్జి దాదాపు కిలోమీటర్ ఉంటుందని వినోద్ కుమార్ తెలిపారు. ఈ వంతెన తంగెళ్లపల్లి మండలంలో ప్రారంభమై.. వేములవాడలో ముగిసేలా ఆలోచన చేస్తున్నామన్నారు రాజమహేంద్రవరంలో గోదావరిపై రోడ్ కం రైలు బ్రిడ్జి మాదిరి చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వినోద్ కుమార్ తెలిపారు.