మేం అధికారంలోకి వస్తే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. కౌలు రైతులు సహా ప్రతి పట్టా భూమి రైతుకు రైతు భరోసా కింద ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు చెల్లిస్తామని వివరించారు. వరి ధాన్యం క్వింటాల్ పై అదనంగా రూ.500 బోనస్ చెల్లిస్తామని తెలిపారు.
ఇదిలావుంటే హైదరాబాదులోని తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభకు హాజరైన పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన హామీలను ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే మహిళలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2,500 ఇస్తామని సోనియా తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పేద మహిళలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని వెల్లడించారు.