హైదరాబాద్ బంజారాహిల్స్ నూర్నగర్లో ఓ ఎనిమిదో తరగతి స్టూడెంట్ చిన్న కారణానికే ప్రాణాలు తీసుకుంది. మెుబైల్ ఫోన్ ఎక్కువగా చూడొద్దని తండ్రి మందలించటంతో మనస్థాపం చెంది సూసైడ్ చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్లోని కోచ్బెహర్కు చెందిన సంజీబ్ మండల్ నూర్నగర్లో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు. ఎనిమిదో తరగతి చదువుతున్న పెద్ద కుమార్తె ఇషిక మండల్ (13) స్కూల్ నుంచి రాగానే ఫోన్తో ఎక్కువ సమయం గడుపుతోంది. ఈ క్రమంలోనే ఫోన్ ఎక్కువగా చూడొద్దని తల్లిదండ్రులు ఇషికను శుక్రవారం (సెప్టెంబర్ 15న) రాత్రి మందలించారు. దీంతో గదిలోకి వెళ్లి ఇషిక తలుపులు వేసుకుంది.
కాసేపటికి తల్లి తలుపు తట్టి చూడగా.. అట్నుంచి స్పందన లేదు. అనుమానం వచ్చి వారు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే ఇషిక ఫ్యానుకు చున్నీతో వేలాడుతూ అచేతనంగా కనిపించింది. వెంటనే 108కు సమాచారం అందించగా అక్కడకు చేరుకున్న సిబ్బంది ఇషికను పరిశీలించారు. అయితే.. అప్పటికే ఆమె మృతిచెందినట్లు పోలీసులు నిర్ధారించారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇలా చిన్న కారణానికే బాలిక ఆత్మహత్య చేసుకోవటం స్థానికంగా విషాదం నింపింది.