మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన నలుగురు మృతిచెందారు. అమరావతి జిల్లా చికల్దరా వద్ద ఘాట్ రోడ్డులో కారు అదుపుతప్పి లోయలో పడింది. దీంతో నలుగురు మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. మృతులు ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాలకు చెందినవారిగా గుర్తించారు. బాధితుల్లో ఆరుగురు గ్రామీణ బ్యాంకు ఉద్యోగులని తెలిసింది. వారిలో ఇద్దరు ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లి (టీ)కి చెందినవారని సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతుల వివరాలు, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.