ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనుమానంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 09, 2023, 07:27 PM

మనమీద మనకు కచ్చితమైన నమ్మకం ఉండాలి అంటారు పెద్దలు ఇందుకేనేమో. పరీక్షా ఫలితాలు విడుదల కాకముందే.. సరిగా రాయలేదంటూ అనుమానంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నేడు (మే 9) వెలువడిన ఇంటర్ ఫలితాల్లో 892/1000 (బైపీసీ) మార్కులతో ఏ గ్రేడ్‌లో పాసయ్యాడు. తన కుమారుడు పరీక్షలో పాసైనా.. జీవితంలో ఫెయిల్ అయ్యాడంటూ అతడి తండ్రి రోదిస్తున్న తీరు అందరినీ కలచివేస్తోంది. ఈ విషాదకర ఘటన మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం పిక్లా తండా శివారులోని బోడగుట్ట తండాలో చోటు చేసుకుంది.


మంగళవారం విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో బోడగుట్ట తండాకు చెందిన గుగులోతు కృష్ణ (19)కు 1000 మార్కులకు గాను 892 వచ్చాయి. ఏ గ్రేడ్‌లో ఉత్తీర్ణుడయ్యాడు. అయితే, కృష్ణ తాను బాగా చదవలేదని, పరీక్షలు బాగా రాయలేకపోయానని దిగులు చెందాడు. చదువులో వెనుకబడతాననే భయంతో ఏప్రిల్ 10న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లక్ష్య సాధనలో వెనుకబడుతున్నానని లేఖరాసి పెట్టి, ప్రాణాలు తీసుకున్నాడు.


మంగళవారం వెలువడిన ఫలితాల్లో కృష్ణ అత్యున్నత మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. బైపీసీ విభాగంలో 892 మార్కులు సాధించడమంటే మామూలు విషయం కాదు. కానీ, అనుమానంతో, తొందరపాటు నిర్ణయంతో కృష్ణ జీవితంలో ఫెయిల్‌ అయ్యాడు. ‘కొడుకా.. లేనిపోని అనుమానంతో ఉరేసుకొని చనిపోతివి. ఇప్పుడు ఇంటర్‌లో గిన్ని మార్కులతో పాసయితివి’ అంటూ తల్లిదండ్రులు రోదిస్తున్నారు.


ఇంటర్ మొదటి సంవత్సరం ఫరీక్షల్లో ఫెయిల్ అయ్యానని మనస్తాపానికి గురై ఇంటర్ విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. మేడిపల్లి మండల కేంద్రానికి చెందిన బొడ్డుపల్లి అభిషేక్.. జగిత్యాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. నేడు విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయ్యాడు. ఫలితాలు చూసుకున్న తర్వాత రూమ్‌లోకి వెళ్లాడు. తల్లిదండ్రులు గమనించి తలుపులు తీయమని అడిగినా తీయలేదు. అనుమానం వచ్చి చూసేసరికి ఉరివేసుకొని కనిపించాడు.











SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com