ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పసుపు రైతులను అవమానించారు... పసుపు బోర్డు ఏర్పాటు హామీపై మంత్రి కేటీఆర్ విమర్శలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, May 08, 2023, 07:52 PM

నిజామాబాద్ పసుపు బోర్డు వ్యవహారానికి సంబంధించి కేంద్రంలోని బీజేపీపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తాను ఎంపీగా గెలిస్తే నిజామాబాద్‌కు పసుపు బోర్డు తీసుకొస్తానంటూ గత లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రస్తుత నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ బాండ్ పేపర్‌పై హామీ ఇచ్చిన విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. బాండ్ పేపర్‌ను ట్విట్టర్‌ను షేర్ చేసిన కేటీఆర్.. బీజేపీపై తీవ్ర విమర్శలు కురిపించారు.


'మీ నిజామాబాద్ బీజేపీ ఎంపీ బాండ్ పేపర్‌పై ఇచ్చిన హామీని గుర్తు పట్టారా? పసుపు రైతులకు ఇది నిజమైన అవమానం. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామంటూ గత పార్లమెంట్ ఎన్నికల్లో బాండ్ పేపర్‌పై హామీ ఇచ్చారు. గెలిచిన తర్వాత పసుపు బోర్డు కోసం రైతులు నిరసనలు చేసినప్పటికీ.. బోర్డు ఏర్పాటుకు నిరాకరించారు. ఇది పసుపు రైతులను అవమానించడం కాదా? ఇప్పటికైనా గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. లేకపోతే సిగ్గుమాలిన ద్రోహం చేస్తున్న మోదీ ప్రభుత్వానికి పసుపు రైతులు తగిన గుణపాఠం చెబుతారు' అని ట్విట్టర్ కేటీఆర్ పేర్కొన్నారు.


అయితే కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పసుపు రోగ నిరోధక శక్తిని పెంచుతుందని కరోనా సమయంలో తాను చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అవహేళన చేసిందన్నారు. కాంగ్రెస్ నేతలు అవహేళన చేసింది తనని కాదని, పసుపు రైతులను అవమానించారని విమర్శలు గుప్పించారు. మోదీ వ్యాఖ్యలకు కౌంటర్‌గా నిజామాబాద్ పసుపు బోర్డు విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. నిజమైన అవమానం అది కాదని, ఇది అంటూ బీజేపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.


అయితే గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో పసుపు రైతుల పక్షాన ధర్మపురి అర్వింద్ నిలబడ్డారు. తనను ఎంపీగా గెలిపిస్తే కేంద్రంతో మాట్లాడి పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని, లేకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానంటూ బాండ్ పేపర్ రాసిచ్చారు. దీంతో కల్వకుంట్ల కవితకు వ్యతిరేకంగా పసుపు రైతులు పెద్ద ఎత్తున నామినేషన్లు వేశారు. దీంతో కవిత ఓటమి పాలవ్వగా.. అర్వింద్ బీజేపీ తరపున గెలుపొందారు. కానీ ఎంపీగా గెలిచిన తర్వాత పసుపు బోర్డుపై అర్వింద్ చేతులెత్తేశారు. పసుపు బోర్డు ఏర్పాటుకు ప్రయత్నాలు కూడా చేయలేదు. దీంతో పసుపు బోర్డు హామీని నెరవేర్చాలని రైతులు ఆందోళనలు చేపట్టినా లాభం లేకుండా పోతోంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పసుపు బోర్డు వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారే అవకాశముంది.











SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com