అనోన్యంగా జీవించాల్సిన దంపతులు శత్రువులుగా మారిపోయారు. ఈ క్రమంలో భర్తనే హత్య చేయించిందో మహిళ. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పీఎస్ పరిధిలో భర్తను హత్య చేయించిందో భార్య. ఇందుకోసం రూ.2 లక్షల సుపారీ ఇచ్చింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇందల్వాయిలో గోపాల్, పీరుబాయి దంపతులు నివసిస్తున్నారు. భర్త మద్యానికి బానిసయ్యాడు. భార్యను తరచూ వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో విసిగిపోయిన భార్య.. అతడిని హత్య చేయించాలని నిర్ణయించుకుంది. చందర్, మహేశ్ అనే వ్యక్తులతో డీల్ మాట్లాడుకుంది.
ఈ క్రమంలో భర్తను హత్య చేయడానికి కమ్మలు అమ్మి రూ.2 లక్షల సుపారీ ఇచ్చింది. పథకం పన్నిన వారిద్దరూ.. ఏప్రిల్ 30న మాటు వేసి గోపాల్ ని కిరాతకంగా హతమార్చారు. గోపాల్ ను భార్యే హత్య చేయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 4 సెల్ ఫోన్లు, ఓ బైక్, పాస్ పోర్ట్ స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.