మూడేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఆసరా పింఛన్లల్లో అనర్హులకు చోటు లభించింది. ఇటీవల పట్టణాలు, గ్రామాల్లో వార్డు సభలు నిర్వహించి లబ్ధిదారులకు పింఛను మంజూరు పత్రాలు, కార్డులను ఎమ్మెల్యేలతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు. ఆసరా లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. పింఛన్ల జాబితాలో అనర్హులకు చోటు దక్కిందని జిల్లా యంత్రాంగం స్పందించింది. ఆసరా లబ్ధిదారుల జాబితాను సాంకేతికత ఆధారంగా జల్లెడబట్టి అనర్హులను గుర్తించి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు.
నల్గొండ పురపాలిక పరిధిలో 522 మంది అనర్హులు
నల్గొండ జిల్లాలో ఇటీవల ప్రభుత్వం కొత్తగా 51, 007 మందికి పింఛన్లు మంజూరు చేసింది. అందులో ఒంటరి మహిళలు, వితంతువు, వికలాంగులు, గీతకార్మికులు, చేనేతకార్మికులు, బీడీ కార్మికులతోపాటు 57 ఏళ్ల వయస్పు పైబడిన వారందరికీ పింఛన్లు మంజూరయ్యాయి. అందులో దరఖాస్తులు పరిశీలించకుండానే పింఛన్లు మంజూరు చేయడంతో అర్హులకు అందకుండా అనర్హులకు స్థానం లభించినట్లు ఆరోపణలు వచ్చాయి. మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసిన వాటిని పరిశీలించకుండానే ప్రజావాణి, మున్సిపాలిటీ, గ్రామపంచాయతీలో దరఖాస్తులు స్వీకరించి ఆన్లైన్ చేశారు. ఆన్లైన్ చేసే సమయంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయి. 30 ఏళ్ల వయస్సు, భర్త ఉన్నా ఒంటరి మహిళగా నమోదు చేయించడం, భూమి, భవనాలు ఉన్నా లేనట్లు, కుటుంబ సభ్యులకు ఉద్యోగమున్నా లేనట్లు, ఒకే కుటుంబంలో ఇద్దరు చొప్పున ఆసరా జాబితాలో స్థానం పొందారు. పింఛన్ల మంజూరుపై కథనాలు ప్రచురితం కావడంతో అధికారులు పునఃపరిశీలనకు దిగారు. కొత్త జాబితాల్లోని లబ్ధిదారుల కుటుంబాల్లో ఇదివరకు పింఛన్లు ఉన్నాయా? ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారా? భూములు, ఇతర స్థిరాస్తులను పరిశీలించారు. వీటి ఆదారంగా జిల్లా వ్యాప్తంగా 2, 462 మందిని గుర్తించి ఆసరా జాబితా నుంచి తొలగించారు. అందులో ఒక నల్గొండ మున్సిపాలిటీలోనే 522 మంది అనర్హుల జాబితాలో ఉన్నారు.