టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరస సినిమాల షూటింగుల్లో నటిస్తూ కెరీర్ లో చాలా బిజీగా గడుపుతున్నాడు. చెక్, మ్యాస్ట్రో ఫ్లాప్ తో కెరీర్ డౌన్ స్టేజ్ లో ఉన్న నితిన్ ఈసారి ఎలా అయినా హిట్ కొట్టాలనే కసితో ఒకేసారి రెండు సినిమాలను పట్టాలెక్కించేసాడు. అందులో ఒకటి మాచర్ల నియోజకవర్గం కాగా మరొకటి వక్కంతం వంశీ డైరెక్షన్లో ఇంకా టైటిల్ ఖరారు చెయ్యని సినిమా.
ఇదిలావుంటే, నితిన్ మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. భీమ్లానాయక్ సినిమాతో ఎంత ఫాస్ట్ గా లైమ్ లైట్ లోకొచ్చాడో తిరిగి అంతే ఫాస్ట్ గా కనుమరుగైన డైరెక్టర్ సాగర్ కే చంద్ర చెప్పిన ఒక థ్రిల్లింగ్ స్టోరీ లైన్ కు నితిన్ ఓకే చెప్పాడని, త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్.
అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన సాగర్ రెండో సినిమాతోనే పవర్ స్టార్ ను డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ ను కొట్టేసాడు. ఐతే, భీమ్లానాయక్ లో డైరెక్టర్ గా సాగర్ పేరుకు మాత్రమేనని, తెరవెనకుండి నడిపించిందంతా త్రివిక్రమేనని అప్పట్లో వార్తలు వచ్చాయి. సక్సెస్ క్రిడిట్ లో సగం త్రివిక్రమ్ వశమైంది. దీంతో భీమ్లానాయక్ తర్వాత సాగర్ ముఖం చూసిన వారేలేకపోయారు. పవన్ కు వీరాభిమానినని చెప్పుకునే నితిన్ సాగర్ కు అవకాశమివ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది.