-మార్చి 2 అసెంబ్లీ భవన ప్రారంభానికి ముహూర్తం
-అన్ని కార్పొరేషన్లలో ``అన్న క్యాంటీన్లు'' ఏర్పాటు
-ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారును బాబుకే అప్పజెప్పిన పోలిట్బ్యూరో
-నిరుద్యోగ భృతి, 2019 నాటికి పేదలకు 10 లక్షల ఇళ్లు
-టీడీపీ పోలిట్బ్యూరోలో 17 అంశాలపై చర్చ
విజయవాడ, మేజర్న్యూస్: వెలగపూడి సచివాలయం ఆవరణలో బ్లాక్ 6 పేరుతో నిర్మించిన అసెంబ్లీ భవనం ప్రారంభానికి టీడీపీ పోలిట్బ్యూరో ముహుర్తం ఖరారు చేసింది. మార్చి 2న ఉదయం 11.25 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ భవనాన్ని ప్రారంభిస్తారని పోలిట్బ్యూరో సభ్యులు ప్రకటించారు. ఆదివారం ఉదయం ఉండవల్లిలోని సీఎం నివాసంలో జరిగిన పోలిట్బ్యూరో సమావేశంలో 17 అంశాలపై చర్చ జరిగినట్లు సభ్యులు వెల్లడించారు. ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక నిర్ణయాన్ని చంద్రబాబుకే వదిలేసినట్లు సభ్యులు సోమిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. పార్టీ కోసం పనిచేసిన వారినే అభ్యర్థులుగా ఎంపిక చేయాలని కోరినట్లు తెలిపారు. ఎమ్మెల్యే కోటాలో చంద్రబాబు తనయుడు లోకేశ్ను ఎమ్మెల్సీగా తీసుకోవాలని సభ్యులందరూ ఏకగ్రీవంగా కోరినట్లు తెలిపారు. వైజాగ్లో ఇటీవల జరిగిన పెట్టుబడుల సదస్సులో జరిగిన రూ.10.50 లక్షల కోట్ల ఎంఓయూలు, 20 లక్షల ఉద్యోగ అవకాశాలపై చర్చించినట్లు తెలిపారు. రాష్ర్ట ప్రభుత్వం రూ.270 కోట్లు వెచ్చిస్తూ ప్రవేశపెట్టిన చంద్రన్న బీమా పథకంపై కూడా చర్చించినట్లు తెలిపారు. అమరావతిలో సచివాలయ నిర్మాణం, ఉద్యోగుల తరలింపు ఇంత వేగవంతంగా జరగడంపై సభ్యులందరూ హర్షం వ్యక్తం చేసినట్లు తెలియజేశారు. రాష్ర్టంలోని అన్ని కార్పొరేషన్లలో తొలిదశగా ``అన్న క్యాంటిన్లు'' ఏర్పాటుచేయనున్నట్లు విప్ తెలిపారు. ప్రస్తుతం వెలగపూడిలో అన్న క్యాంటిన్ ఒకటి నిర్వహిస్తున్నారు. అనాథల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. స్థానిక సంస్థలలో మూడంచెల వ్యవస్థ పునరద్దరఫై కేంద్రాన్ని కోరేందుకు నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. ఏకకాలంలో అన్ని రాష్ట్రాలలో ఎన్నికలు జరపాలన్న కేంద్రం ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపాదించిన నిర్ణయానికి పోలిట్బ్యూరో మద్దతు తెలిపినట్లు ప్రకటించారు. టీడీపీ మ్యానిఫెస్టోలో పెట్టిన నిరుద్యోగ భృతి అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 10 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కాల్వ శ్రీనివాసులు తెలిపారు.
2019 నాటికి ఆ లక్ష్యాన్ని చేరుకుంటామని ఆయన స్పష్టం చేశారు. తెలుగు భాషాభివృద్ధికి కృషిచేయడం, రాష్ర్ట విభజన హామీల అమలుకు ప్రత్యేక చట్టం తీసుకురావడానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అమెరికాలో తెలుగువారిపై పోలీట్బ్యూరో అందోళన వ్యక్తం చేసినట్లు తెలిపారు. రాష్ర్టంలో ప్రాజెక్టుల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నట్లు సభ్యులు తెలియజేశారు. చాలా కాలం తరువాత నందమూరి హరికృష్ణ పోలీట్బ్యూరో సమావేశానికి హాజరయ్యారు.