ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ ఎడబాటు దేనికి సంకేతం..మోడీ పర్యటనకు పవన్ దూరమేనా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 04, 2022, 12:08 AM

ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటన నేపథ‌్యంలో పవన్ కళ్యాణ్ తీరు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చాంశనీయంగా మారింది. ప్రధాని మోదీ భీమవరం పర్యటనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూరం కానున్నారని తెలుస్తోంది. మరికాసేపట్లో జనసేన ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తుందని సమాచారం. బీజేపీ మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరవుతారని అంతా భావించారు. కానీ ఆయన దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కార్యక్రమానికి కేంద్రం నుంచి మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే.


ఇటీవల ప్రకాశం జిల్లా పర్చూరులో నిర్వహించిన సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తన పొత్తు కేవలం ప్రజలతో మాత్రమే ఉంటుందన్నారు. అంతకు ముందు ఆయన మూడు ఆప్షన్లను ప్రకటించారు. పవన్ వైఖరి చూస్తుంటే.. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీతో కలిసి వెళ్లడం అనుమానమేననే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బీజేపీ అధినాయకత్వం తీరు పట్ల జనసేనాని అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వైఎస్సార్సీపీ బేషరతుగా మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒకవేళ పవన్ కళ్యాణ్ ప్రధాని పర్యటనకు దూరంగా ఉండిపోతే.. అది ఏపీ రాజకీయాల్లో రాబోయే మార్పునకు సంకేతంగా భావించాల్సి ఉంటుంది. బీజేపీ, జనసేన మధ్య దూరం పెరుగుతుందనడానికి ఇదో ఇండికేషన్‌ అవుతుంది.


కేంద్రం నుంచి ప్రత్యేక ఆహ్వానం అందడంతో.. మాజీ మంత్రి హోదాలో చిరంజీవి ప్రధాని మోదీ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదే సమయంలో ఈ సభ కోసం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు సైతం కేంద్రం ఆహ్వానాలు పంపింది. టీడీపీ నుంచి ప్రజాప్రతినిధులను పంపాలని చంద్రబాబు నాయుణ్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సభకు చంద్రబాబు దూరంగా ఉండిపోనున్నారు. ఆయన స్థానంలో అచ్చెన్నాయుడు మోదీ సభకు వెళ్తారని ప్రచారం జరుగుతోంది. సోమవారం ఉదయం ప్రధాని మోదీ హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి మోదీ, జగన్ ఒకే హెలికాప్టర్‌లో భీమవరం వెళ్తారని తెలుస్తోంది. గత నెలలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీ పర్యటనకు వచ్చే సమయంలో ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని జనసేన నేతలు చేస్తున్న డిమాండ్‌పై ఆయన స్పందిస్తూ.. నడ్డా ఏపీ పర్యటనలో అలాంటి ప్రకటన చేయడం కుదరదని తేల్చి చెప్పారు. ఎవరో డిమాండ్ చేస్తే సీఎం అభ్యర్థిని ప్రకటించడం కుదరదన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com