ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2జీ స్పెక్ట్రమ్ కేసులో 21వ తేదీన తుది తీర్పు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 05, 2017, 10:53 AM

న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ కేసులో పాటియాలా కోర్టు ఈనెల 21వ తేదీన తుది తీర్పును వెల్లడించనున్నది. ఈ విషయాన్ని ఇవాళ ఢిల్లీలోని పాటియాలా కోర్టు తన తీర్పులో పేర్కొన్నది. ఎంపీ కనిమొళి ఆ కేసులో ఇవాళ కోర్టు విచారణకు హాజరయ్యారు. 2జీ స్పెక్ట్రమ్ కేసులో ఆమె నిందితురాలిగా ఉన్నారు. తుది తీర్పు కోసం డిసెంబర్ 21 వరకు వేచి చూద్దామని ఆమె ఈ సందర్భంగా అన్నారు. గతంలో అనేక సార్లు ఈ కేసు వాయిదా పడింది. నవంబర్ 7వ తేదీన చివరి విచారణ జరిగింది. అయితే ఆ విచారణలో తుది తీర్పు తేదీని డిసెంబర్ 5వ తేదీన వెల్లడిస్తామని కోర్టు వెల్లడించిన విషయం తెలిసిందే.  రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలకు సంబంధం ఉన్న మూడు ప్రధాన స్పెక్ట్రమ్ కేసుల్లో సీబీఐ కోర్టు తన తీర్పును వెల్లడించాల్సి ఉంది. వాస్తవానికి గత అక్టోబర్ 25వ తేదీన ఈ కేసులో సీబీఐ కోర్టు తీర్పును ఇవ్వాల్సి ఉండగా, డాక్యుమెంట్లు ఎక్కువగా ఉన్న కారణంగా నవంబర్ 7వ తేదీకి కేసును వాయిదా వేశారు. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై సీబీఐ రెండు కేసులు నమోదు చేయగా, ఈడీ మరో కేసును వేసింది. మాజీ టెలికాంశాఖ మంత్రి ఏ.రాజా, ఎంపీ కనిమొళిలు ఆ కేసు ఛార్జ్‌షీట్‌లో ఉన్నారు. 2జీ స్పెక్ట్రమ్ కింద 122 లైసెన్సులు ఇవ్వడం వల్ల సుమారు 31 వేల కోట్ల నష్టం వచ్చినట్లు సీబీఐ తన కేసులో ఆరోపణలు చేసింది. ఇదే కేసులో రాజా, కనిమొళితో పాటు మరో 19 మందిపై 2014లో ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com