ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్ ప్రత్యామ్నాయా వేదికకై కేసీఆర్ యత్నం...వివిధ ప్రాంతీయ పార్టీల నేతలతో మంతనాలు

national |  Suryaa Desk  | Published : Sun, May 22, 2022, 02:45 PM

ఫెడరల్ ఫ్రంట్ నినాదం ఎత్తుకొన్న కేసీఆర్ తాజాగా దేశంలోని వివిధ ప్రాంతీయ పార్టీలతో నేతలతో సమావేశమవుతున్నారు. అందులోనూ బీజేపీ, కాంగ్రెస్ కు సమానదూరం పాటిస్తున్న ప్రాంతీయ పార్టీల నేతలను కేసీఆర్ కలవడం దేశ రాజకీయాలలో కొత్త చర్చకు దారితీసింది. ఆయన కాంగ్రెస్సేతర ఫ్రంట్ కు సన్నాహాలు చేస్తున్నారు అన్న స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. 


ఇదిలావుంటే తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఢిల్లీలో బిజీ బిజీగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే మరికాసేపట్లో కేసీఆర్ ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లనున్నారు. అనంతరం మధ్యాహ్న భోజనం తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు పంజాబ్‌లోని చండీగఢ్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా రైతు ఉద్యమ సమయంలో మరణించిన రైతుల కుటుంబాలకు పరామర్శిస్తారు. అనంతరం రైతు కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని కేసీఆర్ అందజేయనున్నారు. 600 కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పరిహారం చెక్కులను అందించనున్నారు.


అంతకుముందు శనివారం ఢిల్లీలో అర్వింద్ కేజ్రీవాల్‌, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌లతో కేసీఆర్ వేర్వేరుగా సమావేశమై సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రపతి ఎన్నికకు ప్రాంతీయ పార్టీల తరఫున ఉమ్మడి అభ్యర్థిని పోటీకి దింపే విషయమై వారితో చర్చలు జరిపారు. రాష్ట్రపతి అభ్యర్థిగా అందరికీ ఆమోదయోగ్యమైన నేతను నిలబెట్టడం ప్రస్తుతం చారిత్రక అవసరమని ఈ సందర్భంగా వారు అభిప్రాయపడినట్లు సమాచారం.


అలాగే ఒక జాతీయ ఏజెండాను, దేశానికి ప్రత్యేక రాజకీయ ప్రత్యామ్నాయాన్ని కలిసికట్టుగా రూపొందించాలనే కేసీఆర్‌ అభిప్రాయంతో అఖిలేశ్‌ యాదవ్‌ ఏకీభవించినట్లు తెలిసింది. కేసీఆర్‌ను కలిసేందుకు అఖిలేశ్‌ యాదవ్‌ లక్నో నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చారు. ఆయన్ను కేసీఆర్‌ స్వయంగా తుగ్లక్‌ రోడ్డు నివాసం వెలుపలికి వచ్చి పుష్పగుచ్ఛం, శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు.


మరోవైపు ఈ నెల 26న మాజీ ప్రధాని దేవెగౌడతో కేసీఆర్ బెంగళూర్‌లో సమావేశం కానున్నారు. ఆ తర్వాత మే 27న మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధి గ్రామంలో పర్యటించనున్నారు. అక్కడ ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో భేటీ కానున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 29, 30 తేదీల్లో బెంగాల్, బిహార్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. గల్వాన్ లోయలో చైనాతో జరిగిన వీర పోరాటంలో అమరులైన సైనికుల కుటుంబాలను పరామర్శించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com