అమరావతి: రాష్ట్రంలో నిరుద్యోగ భృతిని అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, వీలైనంత త్వరలో నిరుద్యోగ యువతకు లబ్ధి చేకూరుస్తామని యువజన సర్వీసుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో నిరుద్యోగ భృతిపై సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. దీనిపై ఇప్పటికు మంత్రివర్గ ఉపసంఘం అనేకసార్లు చర్చించిందని, విధివిధానాలు ఖరారు చేస్తున్నామని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో నిరుద్యోగ యువతకు ఏ విధంగా ఉపాధి కల్పిస్తున్నారో అధ్యయనం చేస్తున్నామన్నారు. ఉపాధి కల్పన, ప్రజాసాధికార సర్వే, విద్యాశాఖల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నామన్నారు. నిరుద్యోగ యువతకు భృతి కల్పించడంతో పాటు వారిని సామాజిక సేవా కార్యక్రమాల్లో వినియోగించే అంశం పరిశీలనలో ఉందన్నారు.