విజయవాడ: నగరంలోని ధర్నాచౌక్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. చలో అసెంబ్లీకి ప్రయత్నించిన నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. సీపీఎం నేతలు మధు, బాబూరావు, సీపీఐ నేతలు రామకృష్ణ, దొనేపూడి శంకర్, వైసీపీ నేతలు పార్థసారథి, ఉదయభాను, బెల్లంపల్లి శ్రీనివాస్ అరెస్ట్ చేసిన వారిలో ఉన్నారు. అరెస్టులకు నిరసనగా విద్యార్థి సంఘాల నేతలు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. ధర్నాచౌక్ దగ్గర ట్రాఫిక్ను పోలీసులు మళ్లించారు. శాంతియుతంగా ఎవరైనా తమ నిరసన తెలపవచ్చని సీపీ గౌతమ్ సవాంగ్ చెప్పినా ఎందుకు అరెస్ట్లు చేస్తున్నారని నేతలు ప్రశ్నిస్తున్నారు.
ప్రత్యేకహోదా సాధన కమిటీ ఆధ్వర్యంలో ఛలో అసెంబ్లీకి పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. విజయవాడలో వివిధ ప్రాంతాల నుంచి శాంతి ర్యాలీలు నిర్వహించాలని రాజకీయపార్టీలు నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు వివిధ జిల్లాల్లో పలువురు నేతలను ముందస్తు అరెస్ట్చేశారు. విజయవాడలో ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు పోలీసుల తీరును సమైఖ్య ఉద్యమనేత చలసాని ప్రసాద్ తప్పుబట్టారు. అర్థరాత్రి నుంచి పోలీసులు జీపుల్లో తిప్పుతూనే ఉన్నారని, విభజన హామీల అమలు కోసం పోరాడటం తప్పా అని ప్రభుత్వాన్ని చలసాని ప్రశ్నించారు. తమపై దాడిచేసేందుకు పోలీసులు ప్రయత్నించారని, వ్యక్తిగత కక్ష సాధింపులా ఉందని చలసాని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.