పశ్చిమ బెంగాల్ లోని బీర్భూమ్ జిల్లాలో దారుణం జరిగింది. రాంపూర్హట్ ప్రాంతంలోని బర్షాల్ గ్రామంలో టీఎంసీ నేతలు రెచ్చిపోయారు. ఆ గ్రామానికి చెందిన టీఎంసీ నేత బదు షేక్ బాంబు దాడిలో మరణించారు. దీంతో ఆ గ్రామంలోని టీఎంసీ కార్యకర్తలు ఆగ్రహంతో గ్రామంలోని ప్రత్యర్థులకు సంబంధించిన 5 ఇళ్లకు నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. ఇప్పటి వరకు 12 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. మృతదేహాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. గ్రామంలో ఉద్రిక్తతలను నిలువరించేందుకు పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దించినట్లు సమాచారం.