భారత్ నుంచి బయల్దేరిన ఓ విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో అత్యవసరంగా దానిని పాకిస్తాన్ దేశంలోని కరాచీ ఎయిర్పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఇది ఖతార్ ఎయిర్వేస్ విమానమని, ఢిల్లీ నుంచి దోహా బయలుదేరిందని గుర్తించారు. సోమవారం(మార్చి 21)న ఉదయం 3.50 నిమిషాలకు ఢిల్లీ నుంచి ఖతార్ రాజధాని దోహాకు ఈ విమానం బయలుదేరింది. టేకాఫ్ అవ్వగానే విమానంలో సాంకేతిక సమస్యలను పైలట్లు గుర్తించారు. కార్గో హెల్డ్లో పొగలు వస్తుండటంతో పైలట్లు అప్రమత్తమయ్యారు. దీంతో తెల్లవారుజామున 5.30 గంటలకు ఈ విమానాన్ని కరాచీ ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దీంత ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ వెంటనే ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఆ సమయంలో విమానంలో 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనపై ఖతార్ ఎయిర్వేస్ ప్రయాణికులకు క్షమాపణ చెప్పింది. మరో విమానంలో వారందరినీ దోహాకు తీసుకెళ్లనున్నట్లు తెలిపింది. ఇదిలా ఉండగా పాకిస్తాన్ ఎయిర్పోర్టులో తమకు మంచి నీరు కూడా ఇవ్వలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపిల్లలతో ఉన్న తామంతా ఇబ్బందులు పడుతున్నామని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.