విమాన ప్రయాణం ఎంతటి సుఖాంతమో అప్పుడపుడు ఆందోళన కూడా కలిగిస్తుంది. తాజాగా ఢిల్లీ నుంచి దోహాకు వెళ్తున్న ఖతార్ ఎయిర్వేస్ విమానాన్ని పాకిస్థాన్లోకి కరాచీ విమానాశ్రయంలో అత్యవసరంగా దింపారు. ఇంజిన్లో పొగలు రావడంతో విమానాన్ని కరాచీలో దింపినట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. సోమవారం తెల్లవారుజామున 3.50 గంటలకు 100 ప్రయాణికులతో ఢిల్లీ నుంచి బయలుదేరిన QR579 విమానాన్ని గంటన్నర తర్వాత కరాచీ విమానాశ్రయంలో అత్యవసరంగా దింపేశారు. ప్రయాణికులను విమానం నుంచి దింపేసిన సిబ్బంది.. మరో విమానంలో దోహాకు పంపనున్నట్టు తెలిపారు. ఈ ఘటనపై ఖతార్ విమానయాన సంస్థ స్పందించింది. ‘‘ఈ ఘటనపై విచారణ జరుపుతున్నాం.. కరాచీలో చిక్కుకుపోయిన ప్రయాణికుల కోసం రిలీఫ్ విమానాన్ని ఏర్పాటుచేస్తున్నాం.. మా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతుస్తూ క్షమాపణలు కోరుతున్నాం.. తదుపరి ప్రయాణానికి సహాయం చేస్తాం’’అని ఓ ప్రకటనలో ఖతార్ ఎయిర్వేస్ పేర్కొంది. మరోవైపు, అదే విమానంలో ప్రయాణిస్తున్న భారతీయ వైద్యుడు, కార్డియాలజిస్ట్ డాక్టర్ సమీర్ గుప్తా ఈ విషయం గురించి ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు.. ‘‘కరాచీలో అత్యవసర ల్యాండింగ్ చేసి QR579 ఢిల్లీ-దోహా విమానం ప్రస్తుత పరిస్థితి ఏంటి? ప్రయాణికులకు ఎలాంటి సమాచారం అందించడం లేదు.. ఆహారం కనీసం నీరు కూడా ఇవ్వడం లేదు. కస్టమర్ కేర్ నుంచి స్పందనే లేదు.. దయచేసి సహాయం చేయండి’’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు.