ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నవీన్ శేఖరప్ప మృతదేహం..వైద్యుల కోసం అప్పగింత

national |  Suryaa Desk  | Published : Mon, Mar 21, 2022, 04:22 PM

కొందరు చనిపోయాక కూడా పదిమంది కోసం ఉపయోగపడతారు. అలాంటి ఘటన ఇక్కడా చోటుచేసుకొంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన భారతీయ వైద్య విద్యార్థి నవీన్ శేఖరప్ప మృతదేహం సోమవారం ఉదయం బెంగళూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా నవీన్ కుటుంబసభ్యులు, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సహా ప్రభుత్వ అధికారులు విమానాశ్రయానికి చేరుకుని, పార్దీవదేహానికి నివాళులర్పించారు. శేఖరప్ప మృతదేహాన్ని దేవణగెరె ఎస్ఎస్ హాస్పిటల్‌కు అందజేయనున్నట్టు ఆయన తండ్రి శంకరప్ప తెలిపారు. అయితే, తమ సంప్రదాయం ప్రకారం కర్మకాండలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.‘‘నా కుమారుడు వైద్య రంగంలో ఉండాలని ఆశించాడు.. కానీ అది జరగలేదు.. కనీసం అతడి శరీరమైన పరిశోధనల కోసం వైద్య విద్యార్థులకు సహకరిస్తుంది.. అందుకే వైద్య పరిశోధనల కోసం మృతదేహాన్ని హాస్పిటల్‌కు దానం చేయాలని నిర్ణయించాం’’ అని శంకరప్ప కన్నీటిపర్యంతమయ్యారు. సోమవారం ఉదయం 3 గంటలకు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న శేఖరప్ప మృతదేహాన్ని.. కుటుంబసభ్యులు, బంధువుల సందర్శనార్ధం స్వస్థలానికి తరలించనున్నారు. ఆ తర్వాత దేవణగెరె ఆస్పత్రికి అందజేస్తారు. ‘‘ఉక్రెయిన్‌లో చనిపోయిన నవీన్ శేఖరప్ప మృతదేహాన్ని స్వదేశానికి రప్పించడంలో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు ధన్యవాదాలు.. రష్యా షెల్ దాడుల్లో నవీన్ ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం’’ అని సీఎం బొమ్మై అన్నారు. శేఖరప్ప కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఆర్ధిక సాయం కింద రూ.25 లక్షల చెక్కును అందజేశారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. కర్ణాటకలోని హవేరి జిల్లాకు చెందిన 21 ఏళ్ల నవీన్ వైద్య విద్య కోసం ఉక్రెయిన్ వెళ్లాడు. అక్కడ ఖార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేస్తున్నాడు. రష్యా దాడుల భయంతో బంకర్‌లో దాక్కున్న నవీన్ శేఖరప్ప ఆహారం కోసం బయటకు వచ్చి ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు నవీన్ శేఖరప్ప ఎలా మృతి చెందాడన్న దానిపై కచ్చితమైన సమాచారం ఏదీ లేదని భారత విదేశాంగ శాఖ అనుమానం వ్యక్తం చేసింది. దీంతో నవీన్ మృతిపై విచారణ జరిపిస్తామని రష్యా పేర్కొంది. అయితే నవీన్ మృతితో ఉక్రెయిన్‌లో ఉన్న మిగతా భారతీయ విద్యార్థులు కూడా భయాందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం భారతీయ విద్యార్థులను స్వదేశానికి తరలించే ప్రక్రియను వేగవంతం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com