ఉక్రెయిన్ నగరం ఖర్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్శిటీలో చివరి సంవత్సరం చదువుతున్న నవీన్ మార్చి 1న రష్యా దాడిలో మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత తన కొడుకు మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించాలని కుటుంబసభ్యులు కోరడంతో ప్రభుత్వం ఆ దిశగా ఏర్పాట్లు చేసింది. నవీన్ తండ్రి కూడా తన కొడుకు మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడానికి సహాయం చేయాల్సిందిగా ప్రధాని మోదీని, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని అభ్యర్థించారు. దాదాపు 19 రోజుల నుంచి నవీన్ కుటుంబ సభ్యులు అతడి మృతదేహం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో నవీన్ మృతదేహం తరలింపులో తీవ్ర జాప్యం చోటుచేసుకుందని అధికార వర్గాలు తెలిపాయి. నవీన్ మృతదేహం 20 రోజుల అనంతరం సోమవారం బెంగళూరుకు చేరుకోనుంది. అయితే, మొదట ఆదివారం చేరుతుందని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై శుక్రవారం సాయంత్రం ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. ఆ తర్వాత దానిని సరిచేశారు. నవీన్ శేఖరప్ప మృతదేహం సోమవారం బెంగళూరు విమానాశ్రయానికి ఉదయం 3 గంటలకు చేరుకుంటుందని స్పష్టం చేశారు. ఆదివారం కాదని, సోమవారం వస్తుందని కుటుంబసభ్యులకు తెలియజేసినట్లు వెల్లడించారు.