కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. పెళ్లి చేసుకోమని అడుగుతోందని ఓ యువకుడు తన ప్రియురాల్ని చంపేశాడు. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఒకే కాలేజీలో చదువుకున్న ధనేశ్వరి(23), శివకుమార్ చంద్రశేఖర్ ప్రేమించుకున్నారు. బెంగళూరులోనే ఇద్దరికి ఉద్యోగం వచ్చింది. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని శివకుమార్ ను ధనేశ్వరి అడిగింది. తమ ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి, అంగీకారం తీసుకుంటానని శివకుమార్ ఆమెకు చెప్పాడు. ఇంటికి వెళ్లిన శివకుమార్ తన పెళ్లి ప్రతిపాదన గురించి తల్లిదండ్రులకు చెప్పాడు. తక్కువ కులం అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదని వారు చెప్పారు. దీంతో శివకుమార్ తిరిగి బెంగళూరుకు వెళ్లి తక్కువ కులం కావడంతో పెళ్లి చేసుకోనని ధనేశ్వరికి తేల్చిచెప్పాడు.
ఒకరోజు శివకుమార్ ఆఫీసుకు ధనేశ్వరి వెళ్లింది. తనను పెళ్లి చేసుకోవాలని అతడిని వేడుకుంది. ఈ క్రమంలో ఒక రోజు ధనేశ్వరిని శివకుమార్ నిర్మానుష్య ప్రాంతానికి పిలిపించాడు. అక్కడ ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 80 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరిన ధనేశ్వరి మార్చి 15న కన్నుమూసింది. మృతురాలి సోదరి ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ధనేశ్వరి కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేశారు.