రచయిత, ప్రొఫెసర్ కంచ ఐలయ్యను బహిరంగంగా ఉరి తీయాలని వ్యాఖ్యానించడం తన తప్పేనని, దాన్ని అంగీకరిస్తూ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నానని టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, యూఎస్ సెనెటర్ ఐలయ్యకు మద్దతు పలకడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఇండియాలో తనకు రక్షణ లేదని అంటున్న ఐలయ్య, దేశ గౌరవాన్ని అవమానించారని ఆరోపించారు. ఇష్టానుసారం పుస్తకాలు రాసే హక్కు ఐలయ్యకు ఉంటే, నోటికొచ్చినట్టు మాట్లాడే హక్కు తమకూ ఉంటుందని అన్నారు. అయితే, ఉరి తీయాలని వ్యాఖ్యానించడం కాస్తంత కటువైన మాటేనని, ఏ పరిస్థితిలో అలా మాట్లాడాల్సి వచ్చిందో అందరికీ తెలుసునని అన్నారు. ఐలయ్య పుస్తకంపై సుప్రీంకోర్టులో వేసిన కేసు డిస్పోజ్ అయిందే తప్ప, డిస్మిస్ చేయబడలేదని తెలిపారు. తనకు పిచ్చిపట్టి పుస్తకాలు రాస్తున్నట్టు ఐలయ్య ఒప్పుకున్నారని చెప్పిన టీజీ, పిచ్చితో పుస్తకాలు రాస్తే ఎవరూ ఒప్పుకోరని హెచ్చరించారు.