అమరావతి: విద్యార్ధుల ఆత్మహత్యలు జరగడానికి వీల్లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. విద్య, వైద్య ఖర్చులు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రులను మరింత పటిష్టం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అమరావతిలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ప్రసంగిస్తూ... అమ్మాయిలకు ఎదురుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకునే రోజులు రానున్నాయన్నారు. పిల్లలకు విలువలు నేర్పించాలని, పిల్లలకు ఆస్తులివ్వడం కాదు.. చదువు, సంస్కారం నేర్పించాలని, ప్రతిభా పురస్కారాల్లో బాలికలే అధికంగా ఉండటం సంతోషంగా ఉందన్నారు. అయితే... ఇటీవల కాలంలో చదువు విషయంలో పిల్లలపై ఒత్తిడి పెరుగుతోందని, పిల్లలపై ఒత్తిడి లేకుండా చూడాలని, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలన్నారు. నా అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని ప్రజలు నమ్మారని, పురస్కారాలు సాధించేందుకు విద్యార్థులు ఎంత కష్టపడుతున్నారో రాష్ట్ర అభివృద్ధి కోసం నేనూ అంతే కష్టపడుతున్నానని అన్నారు. పిల్లలు ప్రగతి సాధించినట్టే...నేనూ అభివృద్ధి సాధిస్తున్నానని, సంకల్పసిద్ధితో ఏదైనా సాధ్యమేనని, నదుల అనుసంధానం కోసం సంకల్పం చేయగా అది నెరవేరుతోందని, టెక్నాలజీని వినియోగించి అవినీతి రహిత పాలన అందిస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు.