ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెబ్‌సైట్‌పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన అమిత్ షా తనయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 09, 2017, 08:40 AM

తమ వ్యాపార సంస్థకు నష్టం చేకూరేలా వార్తా కథనాన్ని ప్రచురించిందని ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఓ వెబ్‌సైట్‌పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తనయుడు జే షా రూ.100 కోట్ల రూపాయలకు పరువునష్టం దావా వేశారు. జే షా డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న టెంపుల్ ఎంటర్‌ప్రైజ్ ప్రైవేట్ లిమిటెడ్ టర్నోవర్ 2014-15లో రూ.15,000 ఉండగా, 2015-16 నాటికి 16,000 రెట్లు పెరిగి రూ.80.5 కోట్లకు చేరిందని పేర్కొంటూ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌ ఫైలింగ్స్‌ని ఉటంకిస్తూ సదరు వెబ్ సైట్ ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నాథ్వానికి బంధువైన రాజేష్ ఖండ్వాలా నుంచి టెంపుల్ ఎంటర్‌ప్రైజ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ.15.78 కోట్లు రుణం పొందిందని... అంతేకాకుండా రాజేష్ ఖండ్వాలా రిలయెన్స్ ఇండస్ట్రీస్ సంస్థలో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గాను కొనసాగుతున్నారని ఆ వార్తా కథనం స్పష్టంచేసింది.


వెబ్ సైట్ లో వచ్చిన వార్తా కథనంపై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ మాట్లాడుతూ.. అమిత్ షా తనయుడు జే షా పై ప్రధాని నరేంద్ర మోదీ విచారణకు ఆదేశిస్తారా అని నిలదీశారు. ప్రతిపక్షాలపై ఏమాత్రం ఆరోపణలు వచ్చినా వెంటనే విచారనపేరిట ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, సీబీఐ లాంటి సంస్థల్ని రంగంలోకి దింపే ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి కూడా అలాగే స్పందించే ధైర్యం చేస్తారా అని మోదీపై విమర్శలు గుప్పించారు.


జే షాపై వెబ్ సైట్ లో వచ్చిన వార్తా కథనం చూసి ఇదే అదనుగా భావించిన ఆమ్ ఆద్మీ పార్టీ సైతం కాంగ్రెస్ పార్టీతో గొంతు కలిపి మోదీ, అమిత్ షాలపై విరుచుకుపడింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నారంటూ బీజేపీ నేతలపై ఆమ్ అద్మీ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది.


ఇదిలావుంటే, తన కంపెనీపై వస్తోన్న ఆరోపణల్ని అమిత్ షా తనయుడు కొట్టిపారేశారు. తమ సంస్థ ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని స్పష్టంచేశారు. టెంపుల్ ఎంటర్ ప్రైజ్ ప్రైవేట్ లిమిటెడ్ గురించి సదరు వెబ్ సైట్ ప్రచురించిన వార్తా కథనంలో ఏ మాత్రం వాస్తవం లేదని జే షా తేల్చిచెప్పారు.


తన వ్యాపారాన్ని అప్రతిష్టపాలుచేసి, తన వ్యాపారం విజయం సాధించడం వెనుక తన తండ్రి అమిత్‌షా రాజకీయ పలుకుబడి ఉండవచ్చనే ప్రజల్లో లేనిపోని అపొహలు కలిగేలా ఆ వార్తా కథనం ప్రచురించారు అంటూ జే షా సదరు వెబ్ సైట్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. చట్టబద్ధంగా పూర్తి నియమనిబంధనలకి లోబడి తాను చేస్తోన్న వ్యాపారానికి సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద వున్నాయని, తన టాక్స్ పేయింగ్ రికార్డులు, బ్యాంకు లావాదేవీలే ఆ విషయాన్ని స్పష్టచేస్తాయని జే షా అభిప్రాయపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com