ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం విశాఖ నగరానికి రానున్నారు. ఉదయం 8.05 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.45 గంటలకు తిరుగు ప్రయాణమవుతారు. ఆయన మూడు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
* 8.30 గంటలకు: నోవాటెల్ హోటల్లో ఫిన్టెక్ సంస్థల సీఈవోలతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు. అనంతరం వారితో ప్రత్యేకంగా భేటీ అవుతారు. ఆ తరువాత బ్లాక్చైన్ టెక్నాలజీపై జాతీయ సదస్సును ప్రారంభిస్తారు.
* మధ్యాహ్నం 12.05 గంటలకు బీచ్రోడ్డులోని పాండురంగాపురం విద్యుత్తు సబ్స్టేషన్ వద్ద భూగర్భ విద్యుత్తు వ్యవస్థకు శంకుస్థాపన చేస్తారు. ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో రూ. 760 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించనున్నారు. 20 విద్యుత్తు సబ్ స్టేషన్ల పరిధిలో 670 కిలోమీటర్ల మేర 33కేవీ, 11కేవీ, ఎల్టీ కేబుల్ను భూగర్భంలో నిర్మిస్తారు. సబ్ స్టేషన్ వద్ద శిలాఫలక పనులను అధికారులు ఆగమేఘాలమీద పూర్తి చేస్తున్నారు. పనులను ఎస్ఈ సూర్యప్రకాశరావు, డీఈ పి.వెంకటేశ్వర్లు, ఈడీ రమేష్ప్రసాద్ తదితరులు పర్యవేక్షించారు
* అనంతరం మర్రిపాలెంలో కొత్తగా నిర్మించిన మేరియట్ హోటలును ప్రారంభిస్తారు. ఆ తరువాత ప్రత్యేక విమానంలో కడపకు వెళ్తారు.
* సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఏర్పాట్లను కలెక్టర్ ప్రవీణ్కుమార్ పరిశీలించారు. ప్రతీ సభాస్థలి వద్ద సీనియర్ అధికారులను బాధ్యులుగా పెట్టారు. జిల్లాకు సంబంధించిన వివిధ అంశాలపై సంక్షిప్త నివేదికలను యంత్రాంగం సిద్ధం చేసింది.