రష్యాలోని వ్లాదిమిర్ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర విషాదం చోటుచేసుకుంది. పోక్రోవ్ పట్టణ రైల్వేస్టేషన్ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సును రైలు ఢీకొట్టడంతో 19 మంది అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. రైల్వే క్రాసింగ్ వద్ద రెడ్లైట్ వేసి ఉన్నప్పటికీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వ్యవహరించడం వల్లనే ఘోర ప్రమాదం జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు.
ఉబ్జెకిస్థాన్ నుంచి వలస కార్మికులతో వెళ్తున్న బస్సు ఈ ప్రమాదంలో నుజ్జునుజ్జయింది. ప్రమాద సమయంలో అందులో సుమారు 55 మంది ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో 15 మంది ఉబ్జెకిస్థాన్కు చెందిన వారేనని, వారిలో చిన్నారులు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే లైసెన్స్ ప్లేట్ ఆధారంగా బస్సు కజికిస్థాన్కు చెందినదిగా గుర్తించారు.