జమ చేసుకున్నా నో ప్రాబ్లం
ఐటి నుంచి శుభవార్త
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల చలామణీ రద్దు నేపథ్యంలో బ్యాంకు ఖాతాల్లో రెండున్నర లక్షల రూపాయల కన్నా ఎక్కువగా నగదు డిపాజిట్ చేసిన వారికి ఆదాయ పన్ను (ఐటి) శాఖ నోటీసులు జారీ చేస్తూ ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పవలసిందిగా అడుగుతున్న విషయం తెలిసిందే. అయితే, సీనియర్ సిటిజన్లకు తాజాగా ఆ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చింది. 70 ఏళ్ల పైబడిన వారు చేసిన రూ. 5 లక్షల వరకు పాత నోట్ల డిపాజిట్లపై ఎలాంటి పరిశీలనా చేపట్టబోమని ఐటి శాఖ తెలిపింది. మిగతా వ్యక్తులపై మాత్రం విచారణ కొనసాగుతుందని ఐటి శాఖ చెప్పింది. సీనియర్ సిటిజన్లు ఎలాంటి ఆందోళనా చెందవలసిన అవసరం లేదని ఆ శాఖ సూచించింది. అలాగే 70 సంవత్సరాల లోపు వ్యక్తులు రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు చేసిన డిపాజిట్లపై తమ శా వెబ్సైట్లో వివరాలను నమోదు చేస్తే సరిపోతుందని ఐటి శాఖ తెలిపింది. వారిని కూడా ఇబ్బందులు పెట్టే ప్రశ్నలు అడగబోమని ఆ శాఖ తెలిపింది. వారికి అక్కడితోనే వెరిఫికేషన్ పూర్తవుతుందని ఆ శాఖ తెలిపింది. అయితే, తమకు అనుమానాస్పదంగా అనిపిస్తే విచారణ జరుపుతామని ఐటి శాఖ తెలిపింది.