సదావర్తి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కేసు విచారణను ధర్మాసనం అక్టోబర్ 6కు వాయిదా వేసింది. సదావర్తి భూములకు నిర్వహించిన వేలం ప్రక్రియను ఏపీ ప్రభుత్వం కోర్టుకు వివరించింది. వేలంలో భూములను దక్కించుకున్న వ్యక్తి డబ్బులు కట్టేందుకు ముందుకు రావట్లేదని కోర్టుకు తెలిపింది. వేలంలో పాల్గొన్న రెండో వ్యక్తికి నోటీసులు పంపేందుకు కొంత సమయం పడుతోందని వివరించింది. నోటీసులు పంపించి తదుపరి ప్రక్రియ కొనసాగించేందుకు సమయం కోరింది. దీంతో కోర్టు విచారణను వాయిదా వేసింది. మొదటి, తదుపరి వేలానికి రూ.40 కోట్లు తేడా రావడంపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రభుత్వ భూములు తక్కువ ధరలకు వెళ్తే చూస్తూ ఉండబోమని వ్యాఖ్యానించింది. మరోవైపు ఈ వ్యవహారంలో తమిళనాడు వేసిన పిటిషన్పై విచారణకు అనుమతి నిరాకరించింది.