జింబాంబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్ పై ఐసీసీ మూడున్నర ఏళ్లపాటు నిషేధం విధించింది. ఓ బుకీ నుంచి కొంత మొత్తంలో డబ్బు తీసుకుని స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లు ఒప్పుకుంటూ ఇటీవలే అతడు సంచలన విషయాలు బయటపెట్టాడు. ఈ నేపథ్యంలో అతడిని క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకు దూరంగా ఉండాలని పేర్కొంటూ ఐసీసీ నిషేధం విధించింది. బ్రెండన్ టేలర్ జింబాబ్వే తరఫున 34 టెస్టులు(2320 పరుగులు), 205 వన్డేలు(6684), 45 టీ20లు(934) ఆడాడు.
"2019లో ఓ భారత వ్యాపారవేత్తతో స్పానర్ షిప్ గురించి మాట్లాడేందుకు ఇక్కడికి వచ్చాను. వాళ్లు నాకు రూ.15వేల డాలర్లు ఇస్తానన్నారు. అప్పటికే మాకు బోర్డు నుంచి ఆరు నెలలుగా జీతాలు లేపు. ఆ బిజినెస్మ్యాన్, అతడి మనషులు నాకు పార్టీ ఇచ్చారు. కొకైన్ ఆఫర్ చేశారు. కాదనలేక తీసుకున్నా. ఆ తర్వాత ఆ దృశ్యాలు చూపించి మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడాలని బెదిరించారు. ఏం చేయాలో తెలియక వాళ్లు చెప్పినదానికి అంగీకరించాను. అది నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ వ్యాపారవేత్త తరచుగా ఫోన్ చేసి మ్యాచ్ ఫిక్సింగ్ చేయకపోతే తన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని హెచ్చరించేవాడు. ఈ విషయాన్ని ఐసీసీకి చెప్పడానికి నాకు 4 నెలల సమయం పట్టింది. కానీ నేను ఎటువంటి మ్యాచ్ ఫిక్సింగ్లలో పాల్గొనలేదు. నాకు జరిగిన ఈ విషయం, కొత్త క్రికెటర్లు జాగ్రత్తగా ఉండటానికి ఉపయోగపడుతుంది. నా కుటుంబం, నా స్నేహితులు, మరీ ముఖ్యంగా నన్ను నేను మోసం చేసుకుంటూ బతకలేను. విలువలతో బతకాలనేదే నా ఉద్దేశం." అని టేలర్ ఇటీవల బహిరంగంగా సంచలన విషయాలను బయటపెట్టారు.