నమ్మకంగా ఉండాల్సిన ఓ స్నేహితుడు క్షణిక సుఖాల మోజులో మిత్రద్రోహం చేశాడు. ఫ్రెండ్ భార్యపై కన్నేసి చివరకు ప్రాణాలు కోల్పోయాడు. కర్ణాటకలోని చిక్బళ్లాపురంలో వెలుగు చూసిన ఈ దారుణ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చిక్బళ్లాపురం జిల్లా గౌరీబిదనూర్ తాలూకాలోని కంబలహళ్లి అనే గ్రామంలో అశోక్, శంకర్(30) అనే ఇద్దరు మిత్రులు ఉన్నారు. అశోక్ లారీ డ్రైవర్ గా పని చేస్తుండగా శంకర్ క్లీనర్ గా వెళ్లేవాడు. అశోక్ కు పెళ్లైంది. ఇద్దరూ మంచి స్నేహితులే కావడంతో అప్పుడప్పుడు శంకర్ ను ఇంటికి తీసుకెళ్లేవాడు అశోక్. ఈ క్రమంలో శంకర్ కు అశోక్ భార్య పద్మతో పరిచయం ఏర్పడింది.
ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధం వరకు వెళ్లింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ఫోన్ కాల్స్, వాట్సాప్ సంభాషణలు కొనసాగాయి. అయితే తన భార్యతో శంకర్ కొనసాగిస్తున్న వివాహేతర సంబంధం గురించి అశోక్ కు ఆలస్యంగా తెలిసింది. ఇటీవల శంకర్ ఫోన్లో పద్మతో వాట్సాప్ సంభాషణలు చూసి అశోక్ షాక్ కు గురయ్యాడు. తన పక్కనే ఉంటూ నమ్మక ద్రోహం చేసిన శంకర్ పై కోపంతో రగిలిపోయాడు. అతడిని అంతం చేయాలని ప్లాన్ వేసుకున్నాడు. పని ఉందని శంకర్ ను తనతో పాటు వెంట తీసుకెళ్లాడు అశోక్. ప్లాన్ ప్రకారం మరి కొంత మంది స్నేహితులతో కలిసి శంకర్ ను ఇనుప రాడ్డుతో కొట్టి చంపేశారు. ఆ తర్వాత శవాన్ని మాయం చేయడానికి నిప్పు పెట్టారు. సగం కాలిన శంకర్ మృతదేహాన్ని స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఆ మరుసటి రోజు అశోక్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. తన భార్యతో అక్రమ సంబంధం కొనసాగించడం వల్లే ఈ హత్య చేసినట్లు ఒప్పుకోవడంతో నిందితుడితో పాటు ఈ హత్యలో భాగమైన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.