ఐక్యరాజ్య సమితి వేదికగా తొలిసారి ప్రసంగించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తరకొరియాపై నిప్పులు చెరిగారు. క్షిపణి ప్రయోగాలు చేయకుండా ఉత్తరకొరియాపై తీవ్ర ఒత్తిడి తీసుకురావాలని ఆయన ఐరాస వేదికగా ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు. ఉత్తరకొరియా ఆగడాలను అడ్డుకునేందుకు ఆసియా దేశాలు కూడా అమెరికాతో చేతులు కలపాలని ట్రంప్ కోరారు. ఈ విషయాన్ని శ్వేతసౌధ అధికారిక వర్గాలు వెల్లడించాయి.
దీంతో పాటు ఇరాన్ న్యూక్లియర్ ప్రొగామ్, వెనిజులాలో నెలకొన్న సంక్షోభం, తదితర అంశాల గురించి ఆయన ప్రస్తావించారు. ఉ.కొరియా, ఇరాన్ నేతలతో చర్చలు జరపాలని ప్రపంచ దేశాధినేతలను ఈ సందర్భంగా ఆయన కోరారు. మారణహోమాన్ని సృష్టిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను ఓడిపోయిన వారిగా ట్రంప్ అభివర్ణించారు.
వరుస క్షిపణి ప్రయోగాలతో ప్రపంచ దేశాలకు తలనొప్పిగా మారిన ఉత్తరకొరియాపై ఆంక్షలు విధించాల్సిందిగా ఇటీవల అమెరికా ఐరాస భద్రతా మండలిలో ముసాయిదా తీర్మానాన్ని పెట్టిన విషయం తెలిసిందే. ఈ తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం లభించింది. క్షిపణి ప్రయోగాలు చేస్తున్న ఉ.కొరియాపై గతంలో ట్రంప్ మండిపడ్డారు. ఆ దేశాన్ని వంచకదేశంగా ట్రంప్ పేర్కొన్నారు.